ఒకరిని విడిచి ఒకరు ఉండలేక..

Two Womens Deceased In Kusumanchi Khammam - Sakshi

సాక్షి, కూసుమంచి : ఇద్దరూ తోటి కోడళ్లు. ఒకరు అనారోగ్యంతో మృతిచెందారు. మరొకరు ఆమె మృతదేహంపై పడి రోదిస్తూ అపస్మారక స్థితికి చేరుకుని తనువు చాలించారు. ఈ విషాదకర సంఘటన కూసుమంచి మండలం గంగబండతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన వడ్త్యి సోనా(52) కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయింది. ఆమెకు ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లగా.. మళ్లీ ఆరోగ్యం విషమించి సోమవారం రాత్రి మృతిచెందింది. అయితే ఈ విషయం తెలుసుకుని మంగళవారం ఉదయం మండలంలోని లోక్యాతండాలో స్థిరపడిన ఆమె తోటి కోడలు వడ్త్యి సక్రి(45) గంగబండతండాకు చేరుకుంది. ఈ క్రమంలో సోనా మృతదేహంపై పడి సక్రి బోరున విలపించింది. పది నిమిషాలు దాటినా ఆమె లేవకపోవడంతో పక్కనే ఉన్న వారు సక్రిని లేపే ప్రయత్నం చేయగా.. ఆమె అప్పటికే స్పృహ కోల్పోయి ఉంది. దీంతో హుటాహుటిన ఆటోలో కూసుమంచిలోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. అతడు ఖమ్మం తరలించాలని సూచించారు. దీంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో గంగబండతండా, లోక్యాతండాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top