పత్తాలేని గిరిజన పారిశ్రామిక రాయితీ | There is no Tribal industrial subsidy | Sakshi
Sakshi News home page

పత్తాలేని గిరిజన పారిశ్రామిక రాయితీ

Feb 20 2017 2:42 AM | Updated on Sep 5 2017 4:07 AM

గిరిజన యువతను స్వయం ఉపాధివైపు మళ్లించాలనే సంకల్పంతో తలపెట్టిన పారిశ్రామిక రాయితీ పథకం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.

నాలుగేళ్లుగా విడుదల కాని నిధులు
పేరుకుపోయిన బకాయిలు రూ.123 కోట్లు


సాక్షి, హైదరాబాద్‌: గిరిజన యువతను స్వయం ఉపాధివైపు మళ్లించాలనే సంకల్పంతో తలపెట్టిన పారిశ్రామిక రాయితీ పథకం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ పథ కం కింద ఎంపికైన లబ్ధిదారుల రాయితీ విడు దలకు తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేయడం... మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలోని బకాయిలపై స్పష్టత ఇవ్వకపో వడంతో రాయితీ బకాయిలు ఏకంగా రూ.123 కోట్లు పేరుకుపోయాయి.  ఇందులో రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న రాయితీ బకాయిలు రూ.78 కోట్లు. వాస్తవానికి ఈ నిధులను 2013–14 సంవత్సరం చివర్లో విడుదల చేయాల్సి ఉండగా... అప్పట్లో ఖజానాపై ఆంక్షల నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

ఆ తర్వాత కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం పాత బకాయిల విడుదలపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. దీంతో దాదాపు 4వేల మంది లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలు నెలకొల్పే చిన్న పరిశ్రమలకు గరిష్టంగా 75 శాతం రాయితీ ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2012–13 సంవత్సరంలో ఈ పథకం అందుబాటులోకి రాగా... గిరిజన యువతకోసం అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్ద మొత్తాన్ని రాయితీ కింద ఇచ్చేలా కేటాయించింది. దీంతో ఈ పథకం కింద భారీ వాహనాల కొనుగోలుకు వేలాది దరఖాస్తులు రాగా... అదేస్థాయిలో అధికారులు మంజూరు చేశారు. తొలి ఏడాది నిధుల విడుదల సంతృప్తికరంగా జరిగినప్పటికీ... ఆ తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశంలో రాయితీ నిధుల విడుదలపై ఎంపీ సీతారాం నాయక్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాయితీ సకాలంలో ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అప్పుల పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement