అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం ప్రారంభమైన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం ప్రారంభమైన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. దాదాపు 4గంటలపాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వాణీని గట్టిగా వినిపించారు. సమావేశం అనంతరం టీ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సంపదను అమ్మడానికి అధికార టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను అసెంబ్లీ, కౌన్సిల్లో తీవ్రంగా ఎండగడతామని చెప్పారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రాజకీయ నేతలకు భద్రత అంశంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలకు భద్రతను ఉపసంహరించారని మండిపడ్డారు. రుణమాఫీ, స్వైన్ప్లూ, విద్యుత్ చార్జీలు, కరెంట్ కోతల వంటి సమస్యలను అసెంబ్లీలో నీలదీస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. అంతేకాక అధికార టీఆర్ఎస్పై దూకుడుగా వ్యవహరించాలని.. జానా రెడ్డి, డీ శ్రీనివాస్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు టి. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సూచించారు. ఫిరాయింపుల వంటి రాజకీయ అంశాలపైనే సభను స్తంభింపచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.