Sakshi News home page

కృష్ణవేణికి కన్నీటి పరీక్ష

Published Fri, Mar 27 2015 12:03 AM

పరీక్ష రాస్తున్న కృష్ణవేణి.

జగదేవ్‌పూర్ (మెదక్) : కన్నతండ్రి శవం ఇంట్లో ఉండగానే ఓ విద్యార్థిని తన దుఃఖాన్ని దిగమింగి పదోతరగతి పరీక్ష రాసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం అంతాయిగూడలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని అంతాయిగూడ గ్రామానికి చెందిన తిగుల్ల నర్సయ్యది వ్యవసాయం కుటుంబం. మంగళవారం ఇంట్లో చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నర్సయ్య అదే రోజు రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.

నర్సయ్య కూతురు కృష్ణవేణి చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. బుధవారం నుంచే పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం తండ్రి శవం ఇంట్లోనే ఉంది. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ కృష్ణవేణి కొండపాక మండలం కుకునూర్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పరీక్ష రాసింది. మధ్యాహ్నం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంది. కృష్ణవేణికి వచ్చిన కష్టాన్ని చూసి పలువురు జాలిపడ్డారు.

Advertisement

What’s your opinion

Advertisement