రోడ్డు ప్రమాదంలో ‘సాక్షి’ సబ్ఎడిటర్ మృతి
విధులు ముగించుకొని బైక్పై వెళ్తుండగా కొత్తపల్లి వద్ద ప్రమాదం
ప్రజాశక్తి దినపత్రికతో మొదలైన ప్రస్థానం.. ‘సాక్షి’లో చివరి నిమిషం వరకు
అశ్రునయనాల మధ్య సుందరగిరిలో అంతిమ వీడ్కోలు
అల్గునూర్ (కరీంనగర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాక్షి సబ్ ఎడిటర్ శ్రీమూర్తి ఆంజనేయులు (38) మృతిచెందారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని సాక్షి యూనిట్ కార్యాలయంలో విధులు ముగించుకొని శుక్రవారం అర్ధరాత్రి స్వగ్రామం చిగురుమామిడి మండలం సుందరగిరి వెళ్తున్నారు. అదే మండలం కొత్తపల్లి శివారులోని పెట్రోలు బంక్ వద్ద ఒక వ్యక్తిని తప్పించబోయి అదుపు తప్పి కింద పడటంతో ఆంజనేయులు తీవ్రగాయాల పాలయ్యారు. 108 వాహనంలో కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఆంజనేయులుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
స్వగ్రామం సుందరగిరిలో అంత్యక్రియలు
ఆంజనేయులు స్వగ్రామం చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, జర్నలిస్టులు, వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల అశ్రునయనాల మధ్య ఆంజనేయులు అం త్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఉదయం నుంచి ఆంజనేయులు మరణవార్త విన్న స్నేహితులు, బంధువులు, ఆయా పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు , అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఆయన పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా, ఆంజనేయులు ప్రజాశక్తి దినపత్రికలో 2003 నుంచి 2008 సబ్ఎడిటర్గా పనిచేశారు. 2008 నుంచి ఇప్పటి వరకు సబ్ఎడిటర్ హోదాలో జగిత్యాలకు డెస్క్ ఇన్చార్జీగా పని చేస్తున్నారు.