ఒక్క క్లిక్‌తో.. సీ విజిల్‌ యాప్‌లో ఫిర్యాదులు

With One Click .. Complaints On C vigil App - Sakshi

కోడ్‌ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం సాంకేతిక నిఘా 

సాక్షి, పాల్వంచరూరల్‌: ఎన్నికలు పారదర్శకంగా సాగేందుకు డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెట్టేందుకు ఈసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. కోడ్‌ ఉల్లంఘన, అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలో సమాజంలోని ప్రతి పౌరుడిని భాగస్వామ్యం చేసేందుకు ఎన్నికల సంఘం ‘సీ విజిల్‌’ యాప్‌ను రూపొందించింది. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే ఒక్క క్లిక్‌తో ఫిర్యాదు నేరుగా ఎన్నికల సంఘానికి వెళ్లే విధంగా దీన్ని తయారు చేశారు. 
ఎన్నికల కమిషన్‌ రాష్ట్రంలో తొలిసారిగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యాప్‌ను ఉపయోగించారు. అప్పుడు మంచి స్పందన రావడంతో దాన్ని ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు.  

వంద నిమిషాల్లోనే..  
స్మార్ట్‌ఫోన్‌లో గుగూల్‌ ప్లే స్టోర్‌లో సీ విజిల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో వివరాలను నమోదు చేసుకోవాలి. ఎక్కడైతే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరిగిందో దానికి సంబంధించిన ఫొటో గానీ, వీడియో గానీ తీసి.. దాన్ని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో నాయకులతో కూడిన ఫ్లెక్సీలు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలు.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉండటం.. ఇలాంటి కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడితే వాటిని యాప్‌లో ఒక్క క్లిక్‌తో అప్‌లోడ్‌ చేయొచ్చు. సీ విజిల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం వెంటనే పరిశీలిస్తుంది. వంద నిమిషాల్లోనే చర్యలకు పూనుకుంటుంది. యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారి పేర్లు, సెల్‌ నంబర్లను ఈసీ గోప్యంగా ఉంచుతుంది.  

3లోగా ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ - ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌  

ఖమ్మంసహాకరనగర్‌: సార్వత్రిక ఎన్నికలను పురష్కరించుకొని జిల్లాలో ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ వచ్చే నెల 3వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పేర్కొన్నారు. 
మంగళవారం టీటీడీసీ సమావేశ మందిరంలో సెక్టోరియల్‌ అధికారులకు ఈవీఎం కమీషనింగ్‌పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈవీఎంల కమీషనింగ్‌పై సెక్టోరియల్‌ అధికారులకు సమగ్ర అవగాహన కలిగి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు.

బూత్‌ లెవల్‌ ఏజెంట్ల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికి తిరిగి ఫొటో ఓటర్‌ స్లిప్పులను అందజేయాలన్నారు. ఏజెంట్లు స్వయంగా ఎట్టి పరిస్థితుల్లో ఫొటో ఓటర్‌ స్లిప్పులు పంపిణీ చేయరాదన్నారు. శాసన సభ ఎన్నికల   మాదిరగానే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా దివ్యాంగ, గర్భిణులు, బాలింతలు, వయోవృద్ధులకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హన్మంతు కొడింబా, సెక్టోరియల్‌ అధికారులు, జిల్లా స్థాయి నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top