
లైంగిక వేధింపులు: 90శాతం తెలిసిన వారే నిందితులు!
దేశంలోని బాలికలు ఆన్లైన్లోనే అత్యధికంగా వేధింపులకు గురవుతున్నారని డీజీపీ అనురాగ్ శర్మ ఆందోళన వ్యక్తంచేశారు.
హైదరాబాద్: దేశం మొత్తంలో 51 శాతం బాలికలు, 43 శాతం బాలురు ఆన్లైన్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని డీజీపీ అనురాగ్ శర్మ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతీ వ్యక్తి చేతికి స్మార్ట్ఫోన్, నెట్ రావడంతో వేధింపుల కేసులు పెరిగాయన్నారు. ఇంటర్నెట్ సామాన్యుడికి కేవలం 4 శాతం మాత్రమే ఉపయోగ పడుతోందని చెప్పారు. మిగతా 96శాతం క్రైం కార్నర్కు కేరాఫ్గా మారుతోందని అభిప్రాయపడ్డారు. బాలబాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల కేసుల్లో 90శాతం తెలిసిన వ్యక్తులే నిందితులవుతున్నారని తమ అధ్యయనంలో బయటపడిందని డీజీపీ స్పష్టం చేశారు.
సీఐడీ నేతృత్వంలో జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న ఆన్లైన్లో చిన్నారులకు లైంగిక వేధింపులు - నియంత్రణ చర్యలు సదస్సులో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, పాఠశాలల యాజమాన్యాలను ఉద్దేశించి మాట్లాడారు. తమ కూతురు పలాన వ్యక్తి వల్ల లైంగిక వేధింపులకు గురైందని తెలిసినా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు బయటపడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో నిందితుల పలుకుబడితో బయటపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పాఠశాలల్లో బాలికలు లైంగిక వేధింపులకు గురవుతుంటే అక్కడి యాజమాన్యాలు తమ స్కూల్ గౌరవం చెడిపోతుందని విషయాన్ని దాచేస్తున్నారన్నారు. సమాజంలో స్టేటస్ సింబల్ పేరుతో తల్లిదండ్రులు పిల్లలకు విచ్చలవిడి స్వేచ్చ ఇస్తున్నారని, స్మార్ట్ఫోన్లు, ట్యాబులు.. ఇలా లావిష్నెస్ పెరగడం లైంగిక వేధింపులు ఎక్కువవడానికి ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తం కావాలని కోరారు.