
ప్రైవేటు పుస్తకాల నిషేధంపై హైకోర్టు స్టే
ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో సర్కారు ముద్రించిన పాఠ్యపుస్తకాలను వినియోగించాలని విద్యాశాఖ
స్కూళ్లను సీజ్ చేయొద్దని విద్యాశాఖకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో సర్కారు ముద్రించిన పాఠ్యపుస్తకాలను వినియోగించాలని విద్యాశాఖ గతేడాది ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. అలాగే ప్రైవేటు పుస్తకాలు ఉన్నాయంటూ ఆయా స్కూళ్లను సీజ్ చేయొద్దని విద్యాశాఖ ఉన్నతాధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ప్రైవేటు పుస్తకాలను నిషేధిస్తూ విద్యాశాఖ గతేడాది మేలో జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) హైకోర్టును ఆశ్రయించింది. ట్రస్మా ఫిర్యాదుపై స్పందించిన న్యాయస్థానం... ప్రైవేటు పుస్తకాల నిషేధానికి సంబంధించి తగిన కారణాలు తెలపాలని విద్యాశాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శి, రాజీవ్ విద్యామిషన్ డెరైక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ పాత ఉత్తర్వులను నిలిపేయాలని సూచించింది.
గత్యంతరం లేకనే కోర్టుకెళ్లాం
ఈ ఏడాది మార్చి 21 నుంచే కొత్త విద్యా సంవత్సరం అమలు చేసే నిమిత్తం ప్రభుత్వ సూచనల మేరకు పరీక్షలను కూడా త్వరితగతిన ముగించాం. కానీ ప్రైవేటు ముద్రణ సంస్థలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సకాలంలో పాఠ్యపుస్తకాలను అందించలేమని విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ప్రారంభాన్ని జూన్ 13కు వాయిదా వేసింది. ప్రభుత్వం పుస్తకాలను సకాలంలో అందించలేక పోయినందున 1 నుంచి 5 తరగతుల వరకు ప్రైవేటు పుస్తకాలను అనుమతించాలని విద్యాశాఖను కోరినా ఫలితం లేకనే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. -నీవూరి శ్రీనివాసరెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు