
కొలకలూరి ఇనాక్
సాక్షి,హైదరాబాద్ : మానవ శ్రేయస్సు కోరే హృదయం ఉన్న ఆచార్య కొలకలూరి ఇనాక్ సమాజంలో జరిగిన సంఘటనలకు స్పందించి రచనలు చేశారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో కళాదీక్షితులు కళావేదికలో జరుగుతున్న కొలకలూరి ఇనాక్ సాహితీ సప్తాహంలో భాగంగా ఆదివారం మూడో రోజు సాహితీ కార్యక్రమం జరిగింది.
సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రకుమార్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. దళితులు, బహుజనులు అభ్యున్నతి కోసం రచనలు చేసిన ఇనాక్ రచనలు హృదయాన్ని కదిలిస్తాయన్నారు.
ఊరబావి నవలలో యథార్థ ఘటనలున్నాయన్నారు. సభలో ప్రముఖ రచయిత్రి ఆచార్య డా.సి.మృణాళిని, డా.ముక్తేవి భారతి, కళా జనార్దనమూర్తి, వై.రాజేంద్ర ప్రసాద్, ఆచార్య కొలకలూరి ఇనాక్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు సచ్చిదానంద కళాపీఠం చిన్నారులు సంగీత నృత్యాంశాలు ప్రదర్శించారు.