ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య సోమవారం భేటీ అయ్యారు.
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య సోమవారం భేటీ అయ్యారు. వరంగల్ టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్రెడ్డితో కలసి రాజయ్య సీఎం నివాసానికి వెళ్లారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాక రాజయ్య సీఎంను కలవడం ఇదే మొదటిసారి. సుమారు ఇరవై నిమిషాల పాటు రాజయ్య సీఎం వద్ద ఉన్నారు.
తొందరపడొద్దని, మంచి రోజులు ఉన్నాయని, కొంత ప్రవర్తన మార్చుకోవాలని రాజయ్యకు సీఎం సూచించారని, సుతిమెత్తగా మందలించారని సమాచారం. కాగా, తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని, కొందరు అధికారులు తనను మభ్యపెట్టారని రాజయ్య జవాబిచ్చుకునే ప్రయత్నం చేశారని తెలిసింది.
అయిదారు నెలల పాటు ఓపిక పడితే, మరో పదవి ఇస్తామని భరోసా కూడా లభించిందని చెబుతున్నారు. సమావేశం అనంతరం రాజయ్య మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు. మంగళవారం జరిగే పార్టీ సమావేశానికి ఆహ్వానించారని తెలిపారు.