జర్నలిస్టుల కుటుంబాలకు సాయం | Aid to the families of journalists | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల కుటుంబాలకు సాయం

Feb 17 2017 12:28 AM | Updated on Aug 14 2018 10:51 AM

రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు చనిపోయిన 69 మంది జర్నలిస్టు కుటుంబాలు, పనిచేయలేని స్థితిలో ఉన్న 15 మంది

నేడు 84 మందికి సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

హైదరాబాద్‌: రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు చనిపోయిన 69 మంది జర్నలిస్టు కుటుంబాలు, పనిచేయలేని స్థితిలో ఉన్న 15 మంది జర్నలిస్టు  కుటుం బాలకు శుక్రవారం జనహిత కార్యక్రమంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెక్కులు అందజేయనున్నారు. ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్‌ జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ ఏటా రూ.10 కోట్ల చొప్పున రెండేళ్లుగా రూ.20 కోట్లు డిపాజి ట్‌ చేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన పుట్టినరోజును పురస్కరిం చుకుని ఈ ఆర్థిక సాయం చేయనున్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పెన్షన్, ఆ కుటుంబంలో పదోతరగతి లోపు విద్యార్థులుంటే అదనంగా మరో రూ.1,000 చొప్పున ఇస్తారు. గాయపడిన, అనారోగ్యానికి గురై పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అధ్యక్షతన పాలకమండలి
జర్నలిస్టుల సంక్షేమ నిధికి సంబంధించి ప్రత్యేకంగా పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మండలికి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మల్లేపల్లి లక్ష్మయ్య, సీఆర్‌ గౌరీశంకర్, యం.నారాయణరెడ్డి, ఎన్‌.వేణుగోపాల్, కె.అంజయ్య, పౌర సంబంధాల శాఖ నుంచి నాగయ్య కాంబ్లే, ఎల్‌ఎల్‌ఆర్‌ కిశోర్‌బాబు, ఎస్‌ఆర్‌ హాష్మీ ప్రతినిధులుగా, సభ్యకార్యదర్శిగా ప్రెస్‌ అకాడమీ కార్యదర్శి బి.రాజమౌళి, మేనేజర్‌గా జి.లక్ష్మణ్‌కుమార్‌లను నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement