వడదెబ్బతో వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతిచెందారు.
వరంగల్ : వడదెబ్బతో వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టు శివారు గిద్దబండ తండాకు చెందిన బానోతు లక్ష్మి (56) అనే మహిళ ఈ నెల 2వ తేదీన గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లింది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన లక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ మృతి చెందింది.
కాగా మరిపెడమండలంలోని వీరారం శివారు దుబ్బతండాకు చెందిన గుగులోతు భీమ(40) వంటచెరకు కోసం ఆదివారం అడవికి వెళ్లాడు. ఎండ తీవ్రత తాళలేక మృతి చెందాడు. ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన షేక్ అబ్బాష్(38) ఆదివారం కుటుంబ పనుల నిమిత్తం ఎండలో తిరిగాడు. రాత్రి ఇంటికి వచ్చాక వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స చేయించగా..సోమవారం తనువు చాలించాడు.