
అవసరమైతే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా: వైఎస్ జగన్
ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ కు అన్ని ప్రయోజనాలు వస్తాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ కు అన్ని ప్రయోజనాలు వస్తాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రవాసాంధ్రులతో ఆదివారం రాత్రి లైవ్ షో ద్వారా ఆయన ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని, హైదరాబాద్ నగరం మనకు లేకుండా పోవడం వల్ల 98 శాతంపైనే కంపెనీలు కోల్పోయామని చెప్పారు. 70 శాతం ఉత్పత్తి రంగం హైదరాబాద్ లోనే ఉందని గుర్తు చేశారు.
ఇప్పుడున్న మౌలిక వసతులతో మనం పోటీ పడలేమని, ప్రత్యేక హోదా వస్తేనే అన్ని వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం ఉండదని, పారిశ్రామిక రాయితీలు వస్తాయని వెల్లడించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే రాయితీలు వస్తాయని తెలిపారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీయిచ్చిందన్నారు. హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు మాట్లాడడం లేదన్నారు. హోదా ఇవ్వబోమన్న జైట్లీ ప్రకటనను చంద్రబాబు సిగ్గులేకుండా స్వాగతించారని ధ్వజమెత్తారు. అరుణ్ జైట్లీ ప్రకటన మొత్తం చూస్తే ఎవరు థ్యాంక్స్ చెప్పరని అన్నారు. మన రావాల్సిన వాటా కంటే ఏమీ రానప్పుడు ప్యాకేజీ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా రాజీపడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తుంటే నీరుగార్చే ప్రయత్నం చేశారని విమర్శించారు.
రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. అవసరమైతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని స్పష్టం చేశారు. సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం అందరినీ కలుపుకు పోతామని, పోరాటం చేస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చితీరుతుందని ఆయన భరోసాయిచ్చారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
- పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని సాధించుకోవడం పెద్ద కష్టం కాదు
- చంద్రబాబు లాంటి అబద్దాలకోరు మరెవరూ ఉండరు
- పోలవరం ప్రాజెక్టు నిబంధనలను అడ్డగోలుగా మార్చారు
- వ్యవస్థలో మార్పు రావాలి, నేతలను నిలదీసే పరిస్థితి రావాలి
- ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం
- పరిశ్రమలు వస్తేనే యువతకు ఉపాధి లభిస్తుంది
- ప్రత్యేక హోదా వస్తేనే పారిశ్రామిక రాయితీలు వస్తాయి
- రాయితీలు ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు
- ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులే మోసం చేస్తే పరిస్థితి వస్తే ఇంకెవరికి చెప్పాలి?
- ప్రత్యేక హోదా ఉద్యమంలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుపోతాం
- ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులతో కలిసే ముందుకు సాగుతున్నాం
- ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయారు
- బీజేపీ రాష్ట్రానికి ఏం చేసినా చేయకపోయినా తన కేసులను పట్టించుకోకపోయినా ఫర్వాలేదని బాబు అనుకుంటున్నారు
- రాష్ట్ర ప్రజల తరపున నిజాయితీగా పోరాడుతున్నది మాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారు
- అందరు కలిసి రాబట్టే ప్రత్యేక హోదా కోసం చేపడుతున్న ప్రతి ఆందోళన విజయవంతం అవుతోంది
- మా ఆందోళనలతో హోదాపై ప్రజలందరినీ చైతన్యపరుస్తున్నాం, మా ధ్యేయం హోదా సాధించమే
- హోదా సంజీవనే.. పదేళ్లు కాదు పదిహేనేళ్లు ఇవ్వాలన్న చంద్రబాబు, వెంకయ్య నాయుడే ఇవాళ మాట మారుస్తున్నారు
- విభజనపై యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏపీలో కాంగ్రెస్ ఎలా చతికిలపడిందో.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీది కూడా అదే పరిస్థితి
- ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఒక్క ప్రధానిమంత్రికే ఉంది
- ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడు చెప్పలేదు. ఆ సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖ చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది
- ప్రత్యేక హోదా ఉన్న జమ్మూకశ్మీర్ కు ప్రధాని మోదీ రూ. 80 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. అయితే హోదా ఉండనట్టా?
- 2019లో కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. 280 సీట్లు ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. 22-23 సీట్లు గెల్చుకుంటే కేంద్రాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది
- వినుకొండ ఎమ్మెల్యే ఎక్కడో ప్రత్యేక హోదా ఇచ్చిన హిమచల్ ప్రదేశ్ లో కంపెనీ పెట్టారు దీనిని ఏమనాలి?
- హోదా వచ్చే లాభాలతో పారిశ్రామికవేత్తలు వారంతట వారే పెట్టుబడులు పెడతారు
- రాజధాని విషయంలో చంద్రబాబు అందరినీ తప్పుదోవ పట్టించారు
- 4 పంటలు పండే భూములను మాయమాటలు చెప్పి రైతుల నుంచి కొట్టేశారు
- ఇప్పుడు స్విజ్ చాలెంజ్ పేరుతో కాలయాపన చేస్తున్నారు
- పార్టీ మారి వచ్చిన 20 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించరు
- చంద్రబాబు అవినీతి ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు
- ఏపీలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది
- చదువుకున్న యువత, మంచి నైపుణ్యం ఉన్న యువత ఉంది
- ప్రత్యేక హోదా వస్తే వాళ్లందరికీ మేలు జరుగుతుంది
- ఎవరు ధైర్యం కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసంతో పోరాడితే కచ్చితంగా హోదా వస్తుంది
- ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసి రావాలి. మీ అందరి మద్దతు కావాలి
- పోరాటం చేస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది