గట్టుప్పల్‌ మండలం కోసం యువతి ఆత్మహత్య | women commit suicide for ghattuppal mandal | Sakshi
Sakshi News home page

గట్టుప్పల్‌ మండలం కోసం యువతి ఆత్మహత్య

Oct 14 2016 5:55 PM | Updated on Sep 4 2017 5:12 PM

గట్టుప్పల్‌ మండలం కోసం యువతి ఆత్మహత్య

గట్టుప్పల్‌ మండలం కోసం యువతి ఆత్మహత్య

నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్ గ్రామాన్ని మండలం చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది.

గట్టుప్పల్: నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్ గ్రామాన్ని మండలం చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. తాజాగా శుక్రవారం చండూరు మండలం గట్టుప్పల్ గ్రామానికి చెందిన బొడిగె సోని(20) అనే యువతి గట్టుప్పల్‌ను మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. గట్టుప్పల్ ను మండలం చేస్తామని ప్రభుత్వం ప్రకటించి, చివరికి కొత్త జిల్లాల ముసాయిదాలో మండలాల జాబితాలో గట్టుప్పల్ పేరు లేకపోవడంతో మనస్తాపానికి లోనై సోని ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. సోనిది పరువు హత్య అయి ఉండొచ్చునని పోలీసులు, అధికారులు భావిస్తున్నారు. కాగా, గత నాలుగు రోజులుగా గట్టుప్పల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే.
 
భారీగా మోహరించిన పోలీసులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారుతుండటంతో పోలీసులను గ్రామస్తుల దీక్షను భగ్నం చేశారు. ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, పదుల సంఖ్యలో ఎస్ఐలతో ఓ బెటాలియన్ గ్రామంలో దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని ముందు జాగ్రత్తగా ఫైరింజన్ ను ఏర్పాటుచేశారు. భాష్పవాయువును ప్రయోగిస్తామని ఇప్పటికే పోలీసులు ధర్నాకు దిగిన స్థానికులను హెచ్చరించారు.


అట్టుడుకుతున్న గట్టుప్పల

గట్టుప్పలను మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ బుధవారం ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన వివరాలు.. గట్టుప్పల గ్రామానికి చెందిన ఏర్పుల యూదయ్య ఉదయం స్థానికంగా నిర్వహిస్తున్న దీక్ష స్థలానికి చేరుకున్నాడు. తొలుత గట్టుప్పలను మండలంగా ప్రకటించి ముసాయిదాలో ఆ విషయాన్ని ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సీఐ రమేష్‌కుమార్ స్థానికులతో కలిసి మంటలు ఆర్పించి ఆస్పత్రికి తరలించారు. 30 శాతానికి పైగా కాలిపోయిన యూదయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నేతల ఆధిపత్య పోరుతో ప్రజలకు నష్టం

జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కలిసి ఉద్యమాన్నినీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని గట్టుప్పల స్థానికులు ఆరోపిస్తున్నారు. గట్టుప్పలను మండల కేంద్రంగా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ వెంటనే పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. అయితే చివరి నిమిషంలో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ముసాయిదాలో గట్టుప్పల పేరును మండలాల జాబితాలో చేర్చకపోవడంతో ప్రజలు దసరా పండుగను కూడా నిర్వహించుకోలేదు.

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు నల్గొండ డివిజన్ లోని గట్టుప్పలకు  శాపంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అన్ని అర్హతలతో మండలం చేస్తున్నట్లు ప్రకటన రావడంతో, అన్ని ఆఫీసులు సిద్ధం చేశారు. కానీ, అర్ధరాత్రి ప్రకటించిన ముసాయిదాలో మండలాల జాబితాలో గట్టుప్పల పేరును మాయం చేశారని ఆరోపిస్తూ దసరా పండుగ రోజు నుంచి ఇక్కడి ప్రజలు నిరసన చేస్తూ సీఎం కేసీఆర్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement