
తడ'బ్యాటు'కు లోనై.. టపటపా!
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మన్ తీవ్ర ఒత్తిడికి గురై టపటపా క్యూకట్టేశారు.
కళ్లముందు కొండంత లక్ష్యం.. అది కూడా చావోరేవో తేల్చుకుని ఫైనల్స్కు చేర్చాల్సిన సెమీఫైనల్స్ మ్యాచ్. ప్రత్యర్థి అలాంటి, ఇలాంటి జట్టు కాదు.. ఆసీస్. అయినా ఓపెనర్లు అంతంతమాత్రంగానే ఆడారు. మిడిలార్డర్ కూడా కుప్పకూలిపోయింది. ఇక టెయిలెండర్లు మాత్రం చేసేదేముంది.. చేతులు ఎత్తేయడం తప్ప? ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మన్ తీవ్ర ఒత్తిడికి గురై టపటపా క్యూకట్టేశారు. వికెట్లు పడిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
మొట్టమొదట 12.5 ఓవర్ల వద్ద శిఖర్ ధవన్ ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 76 పరుగులు మాత్రమే. అభిమానులంతా కొండంత ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ.. ఒక్క పరుగు మాత్రమే చేసి, జట్టు స్కోరు 78 వద్ద వెనుదిరిగాడు. 91 పరుగుల వద్ద మూడో వికెట్, 108కి నాలుగో వికెట్ పడిపోయాయి. తర్వాత మరో 70 పరుగుల వరకు వికెట్ పడకుండా ఆడినా.. 178 వద్ద ఐదో వికెట్, ఇంకో 30 పరుగులకే.. అంటే 208 వద్ద ఆరో వికెట్ పడిపోయాయి. 231 పరుగులకు ఏడో వికెట్ రూపంలో కెప్టెన్ ధోనీ కూడా ఔట్ కావడంతో.. ఇక భారత అభిమానుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. చివర్లో బౌలర్లు అశ్విన్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్ మరొక్క రెండు పరుగులకే.. అంటే 233లోపే ఔటయిపోయారు. దాంతో భారత్ పరాజయం పాలైంది.
వికెట్ల పతనం ఇలా..
1-76 (ధవన్), 2-78 (కోహ్లీ), 3-91 (రోహిత్ శర్మ), 4-108 (రైనా), 5-178 (రహానే), 6-208 (జడేజా), 7-231 (ధోనీ), 8-232 (అశ్విన్), 9-232 (మోహిత్ శర్మ), 10-233 (ఉమేష్ యాదవ్)