రన్నరప్‌ సౌరభ్‌ వర్మ | Saurabh Verma Lost In The Final | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సౌరభ్‌ వర్మ

Dec 2 2019 4:34 AM | Updated on Dec 2 2019 1:30 PM

Saurabh Verma Lost In The Final - Sakshi

లక్నో: ఈ ఏడాది మూడో టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత షట్లర్, జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మకు నిరాశ ఎదురైంది. సయ్యద్‌ మోదీ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నీలో ఈ మధ్యప్రదేశ్‌ ప్లేయర్‌ రన్నరప్‌తో సంతృప్తి చెందాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్‌ సౌరభ్‌ 15–21, 17–21తో ప్రపంచ 22వ ర్యాంకర్‌ వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సౌరభ్‌ రెండు గేముల్లోనూ ప్ర్యత్యర్దికి పోటీనివ్వలేకపోయాడు.

విజేత వాంగ్‌ జు వెకి 11,250 డాలర్లు (రూ. 8 లక్షలు), రన్నరప్‌ సౌరభ్‌ వర్మకు 5,700 డాలర్లు (రూ. 4 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ఏడాది సౌరభ్‌ హైదరాబాద్‌ ఓపెన్, వియత్నాం ఓపెన్‌ టోరీ్నలలో టైటిల్స్‌ సాధించాడు. వాంగ్‌ జు వె నెగ్గడంతో... 2014 తర్వాత సయ్యద్‌ మోదీ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో విదేశీ ఆటగాడికి టైటిల్‌ లభించినట్లయింది. 2014లో జుయ్‌ సాంగ్‌ (చైనా) విజేతగా నిలువగా... 2015లో పారుపల్లి కశ్యప్‌ (భారత్‌), 2016లో కిడాంబి శ్రీకాంత్‌ (భారత్‌), 2017, 2018లలో సమీర్‌ వర్మ (భారత్‌) చాంపియన్స్‌గా నిలిచారు.   

Advertisement
 
Advertisement
Advertisement