ముంబై బ్యాట్స్‌మెన్‌ విఫలం | Mumbai batsmen fail | Sakshi
Sakshi News home page

ముంబై బ్యాట్స్‌మెన్‌ విఫలం

Nov 10 2017 12:15 AM | Updated on Nov 10 2017 12:15 AM

Mumbai batsmen fail - Sakshi

ముంబై: భారత రంజీ ట్రోఫీలో 500వ మ్యాచ్‌ ఆడుతున్న ఘన చరిత్ర ముంబైది. అయితే బరోడాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై తొలిరోజు ఆటలో తడబడింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ ఆదిత్య తారే (50; 8 ఫోర్లు) ఒక్కడే రాణించగా... మిగతావారిలో శ్రేయస్‌ అయ్యర్‌ 28, సిద్ధేశ్‌ లాడ్‌ 21 పరుగులు చేశారు. రహానే, పృథ్వీ షా డకౌటయ్యారు. బరోడా పేసర్లు అజిత్‌ సేథ్, లుక్మాన్‌ మెరీవాలా చెరో 5 వికెట్లు పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బరోడా ఆట నిలిచే సమయానికి 26 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 63 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (32 బ్యాటింగ్‌), ఆదిత్య వాగ్‌మోడే (15 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  

మురళీ విజయ్‌ సెంచరీ...
ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్, తమిళనాడు బ్యాట్స్‌మన్‌ మురళీ విజయ్‌ (273 బంతుల్లో 140; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో కదంతొక్కాడు. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 292 పరుగులు చేసింది. జగదీశన్‌ (88; 11 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. బాబా ఇంద్రజిత్‌ (44 బ్యాటింగ్‌), విజయ్‌ శంకర్‌ (8 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement