వరుస నాలుగు బాల్స్‌లో నాలుగు వికెట్లు | Mortaza picked four wickets in successive balls | Sakshi
Sakshi News home page

వరుస నాలుగు బాల్స్‌లో నాలుగు వికెట్లు

Mar 6 2018 9:22 PM | Updated on Mar 6 2018 9:55 PM

Mortaza picked four wickets in successive balls - Sakshi

మష్రాఫ్‌ మోర్తజా(ఫైల్‌ఫొటో)

ఫతుల్లా: బంగ్లాదేశ్‌ వన్డే కెప్టెన్‌ మష్రాఫ్‌ మోర్తజా అరుదైన ఘనతను సాధించాడు. వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో మోర్తజా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. అబాహనీ లిమిటెడ్‌ జట్టు తరపున ఆడుతున్న మోర్తజా.. అగ్రానీ బ్యాంక్‌ క్రికెట్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. దాంతో అబాహనీ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్‌ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఇలా ఒక బౌలర్‌ వరుస బంతుల్లో నాలుగు వికెట్లు సాధించడం ఇదే తొలిసారి.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన అబాహనీ జట్టు 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిలో భాగంగా లక్ష్య ఛేదనలో అగ్రానీ బ్యాంక్‌ జట్టు ధీటుగా బదులిచ్చింది. 49 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. దాంతో చివరి ఓవర్‌కు 13 పరుగులు అవసరమయ్యాయి. ఆ తరుణంలోబౌలింగ్‌కు దిగిన మోర్తజా తొలి బంతికి పరుగు ఇచ్చాడు. ఆపై వరుసగా నాలుగు వికెట్లు సాధించి అగ్రానీ జట్టుకు షాకిచ్చాడు. 50 ఓవర్‌ రెండో బంతికి దిమాన్‌ ఘోష్‌ను పెవిలియన్‌కు పంపిన మోర్తజా..  మూడో బంతికి అబ్దుర్‌ రజాక్‌ను అవుట్‌ చేశాడు. ఇక నాల్గో బంతికి షఫుల్‌ ఇస్లామ్‌ను ఐదో బంతికి ఫజల్‌ రాబీని అవుట్‌ చేశాడు. ఫలితంగా అగ్రానీ జట్టుపై అబాహనీ జట్టు 11 పరుగుల తేడాతో విజయం​ సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మోర్తజా మొత్తంగా ఆరు వికెట్లు సాధించి అగ్రానీ జట్టు పతనాన్ని శాసించాడు. అంతర్జాతీయ ట్వంటీ 20 మ్యాచ్‌లకు గతంలోనే మోర్తజా గుడ్‌ బై చెప్పడంతో శ్రీలంకలో  జరిగే ముక్కోణపు టీ 20 సిరీస్‌కు దూరం అయ్యాడు. అదే సమయంలో లీగ్‌ మ్యాచ్‌లు ఆడుతూ సత్తాచాటుతున్నాడు మోర్తజా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement