లోధా ప్రతిపాదనలపై చర్చ | Lodha discussion on the proposals | Sakshi
Sakshi News home page

లోధా ప్రతిపాదనలపై చర్చ

Feb 11 2016 12:42 AM | Updated on Sep 3 2017 5:22 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పెను మార్పులను సూచిస్తూ జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై బోర్డు పెద్దలు ........

బీసీసీఐ ప్రత్యేక సమావేశం ఎజెండా అంగీకరిస్తే రూ.1600 కోట్లు నష్టం

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పెను మార్పులను సూచిస్తూ జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై బోర్డు పెద్దలు చర్చించబోతున్నారు. ఈనెల 19న దీని కోసమే ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే ఐసీసీ నుంచి ప్రస్తుతం వివిధ దేశాలకు అందుతున్న వాటాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి హాజరయ్యేలోపే అన్ని సభ్య సంఘాలు లోధా కమిటీ ప్రతిపాదనలపై చర్చించాలని ఇప్పటికే బోర్డు సూచించింది.

ఒకవేళ లోధా కమిటీ ప్రతిపాదనలకు అంగీకరిస్తే బీసీసీఐకి ఏడాదికి రూ.1600 కోట్లు దాకా నష్టం వస్తుందని అంచనా. ప్రస్తుతం టీవీ రైట్స్, ప్రకటనల ద్వారా ఏడాదికి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. లోధా ప్రతిపాదనల ప్రకారం ప్రకటనలు కేవలం లంచ్, డ్రింక్స్ విరామాల్లో మాత్రమే ప్రసారం చేయాలి. ఇలా చేస్తే సంవత్సరానికి రూ.400 కోట్లు కూడా రావని అంచనా. ప్రస్తుతం స్టార్‌స్పోర్ట్స్ సంస్థ ఒక్కో మ్యాచ్ ప్రసారం చేసినందుకు బోర్డుకు రూ.43 కోట్లు చెల్లిస్తోంది. లోధా నిబంధన అమల్లోకి వస్తే మ్యాచ్‌కు రూ.10 కోట్లు కూడా ఇవ్వకపోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement