నా వద్ద రోహిత్‌, కోహ్లిలకు చోటు లేదు! | Jasprit Bumrah Over Virat Kohli In Aakash Chopra's Best Team | Sakshi
Sakshi News home page

నా వద్ద రోహిత్‌, కోహ్లిలకు చోటు లేదు!

May 1 2020 3:49 PM | Updated on May 1 2020 3:56 PM

Jasprit Bumrah Over Virat Kohli In Aakash Chopra's Best Team - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఎంపిక చేసిన అత్యుత్తమ టీ20 వరల్డ్‌ ఎలెవన్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మలకు అవకాశం దక్కలేదు. ప్రతీ దేశం నుంచి తలో క్రికెటర్‌ను ఎంచుకున్న ఆకాశ్‌ చోప్రా.. భారత ప్రస్తుత క్రికెట్‌ జట్టు నుంచి జస్‌ప్రీత్‌ బుమ్రాకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. కేవలం బుమ్రాను మాత్రమే  తన టీ20 బెస్ట్‌ వరల్డ్‌ ఎలెవన్‌లో తీసుకున్న చోప్రా.. ఓపెనర్లుగా ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌తో పాటు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌లను తీసుకున్నాడు. (టీమిండియా ‘అతి పెద్ద’ రికార్డుకు బ్రేక్‌)

ఇక మూడో స్థానంలో న్యూజిలాండ్‌ హార్డ్‌ హిట్టర్‌ కొలిన్‌ మున్రోను ఎంపిక చేశాడు. నాల్గో స్థానంలో పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ను జట్టులో ఎంచుకున్నాడు. ఆపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌, బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబుల్‌ హసన్‌, వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ను తీసుకున్నాడు. షకీబుల్‌, రసెల్‌లు అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ ఆప్షన్‌లుగా చోప్రా తీసుకున్నాడు. స్పిన్నర్ల కోటాలో అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, నేపాల్‌ లెగ్‌ స్పిన్నర్‌ సందీప్‌ లామ్‌చెన్‌లను తీసుకున్న చోప్రా.. పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌లో బుమ్రాతో పాటు శ్రీలంక దిగ్గజ బౌలర్‌ లసిత్‌ మలింగాలకు అవకాశం కల్పించాడు. 

కోహ్లి, రోహిత్‌లకు నో ప్లేస్‌
భారత బ్యాటింగ్‌ విభాగంలో ఏ ఒక్క టీమిండియా క్రికెటర్‌కి చోప్రా అవకాశం ఇవ్వలేదు. కోహ్లి, రోహిత్‌లను పరిశీలనలోకి తీసుకున్నా వారికి ఏ స్థానాల్లో చోటివ్వాలో తెలియలేదన్నాడు. తన వద్ద కోహ్లి, రోహిత్‌లకు చోటు లేదన్నాడు. కోహ్లి, రోహిత్‌లకు అవకాశం ఇవ్వలేదని అభిమానులు అనుకున్నప్పటికీ వారిని ఏ స్థానాల్లో ఎంపిక చేయాలో తెలియలేదని సమర్ధించుకున్నాడు.  కేవలం ఒక భారత క్రికెటర్‌ను మాత్రమే తీసుకోవడంతో బుమ్రాకు చోటిచ్చానన్నాడు. దీనికి సంబంధించి వీడియో సందేశంలో మాట్లాడిన చోప్రా.. ఈ అత్యుత్తమ టీ20 వరల్డ్‌ ఎలెవన్‌ జట్టును ఎంపిక చేయడానికి చాలా కసరత్తు చేసినట్లు తెలిపాడు. ఇది తనకు చాలెంజ్‌గా మారినప్పటికీ చివరకు మంచి జట్టునే ఎంపిక చేసినట్లు తెలిపాడు. ఇది తన టీమ్‌ అంటూ ప్రకటించిన చోప్రా.. మీ అత్యుత్తమ టీ20 జట్టును కూడా ప్రకటించాలని పేస్‌బుక్‌లో అభిమానుల్ని కోరాడు. (‘నాకు చిర్రెత్తుకొచ్చి.. ఆసీస్‌ను సవాల్‌ చేశా’)

Advertisement
 
Advertisement
Advertisement