స్నేహిత్‌ బృందానికి రజతం

Indian paddlers win six medals in team events at Jordan Junior and Cadet Open - Sakshi

జోర్డాన్‌ ఓపెన్‌ టీటీ టోర్నీ

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జోర్డాన్‌ జూనియర్, క్యాడెట్‌ ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ యువతార సురావజ్జుల స్నేహిత్‌ టీమ్‌ విభాగంలో రజతాన్ని సాధించాడు. మనుశ్‌ షా, స్నేహిత్, జీత్‌ చంద్రలతో కూడిన భారత్‌ ‘ఎ’ జూనియర్‌ టీమ్‌ ఫైనల్లో చైనీస్‌ తైపీ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. టైటిల్‌ పోరులో చైనీస్‌ తైపీ బృందం 3–1తో భారత్‌ ‘ఎ’పై విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో స్నేహిత్‌ 0–3తో సిన్‌ యాంగ్‌లీ చేతిలో పరాజయం పాలయ్యాడు.

తర్వాతి మ్యాచ్‌లో మనుశ్‌ 3–1తో మింగ్‌ వీ తైయ్‌పై గెలుపొందడంతో 1–1తో స్కోరు సమమైంది. అనంతరం డబుల్స్‌ పోరులో భారత్‌ 2–3తో తృటిలో ఓటమిపాలవడంతో చైనీస్‌ తైపీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి సింగిల్స్‌ మ్యాచ్‌లో మనుశ్‌ ఒత్తిడికి చిత్తుకాగా భారత్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 3–0తో ఇరాన్‌ ‘ఎ’ టీమ్‌పై, క్వార్టర్స్‌లో ఇరాన్‌ ‘బి’ జట్టుపై గెలిచింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, రెండు కాంస్యాలను భారత క్రీడాకారులు సాధించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top