
ముంబై : భారత జట్టులో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న యువ క్రికెటర్ హర్థిక్ పాండ్యా. కెరీర్ తొలినాళ్లలో తాను చాలా కష్టాలను ఎదుర్కొన్నానని పాండ్యా చెప్పారు. సోదరుడు కృనాల్, తనకు అవకాశాలను ఇప్పించడం కోసం తన తండ్రి చాలా ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పని లేదని ఇరువురూ తండ్రికి చెప్పినట్లు వివరించారు. అలా అని తమకు సాయం చేయని వారెవరూ లేరని అనుకోవద్దని అన్నారు.
కెరీర్లో పైకి రావడానికి కోచ్ తనకు చాలా సాయం చేశారని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా మూడేళ్ల పాటు తన కుటుంబం కష్టాలు పడినట్లు వెల్లడించారు. రోజుకు రూ.5/- దాచుకోవడం కూడా కష్టతరంగా ఉండేదని తెలిపారు. దక్షిణాఫ్రికాలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో విజయం సాధించిన సమయంలో కృనాల్కు రూ. 70 వేలు వచ్చాయని చెప్పారు. ఆ డబ్బుతో కొంతకాలం గడపొచ్చని తాను కృనాల్ మాట్లాడుకున్నామని తెలిపారు.
రెండేళ్ల పాటు కారుకు ఈఎంఐలు కట్టలేకపోయామని వివరించారు. ఆ సమయంలో కారును ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్తారేమోనని రహస్య ప్రదేశంలో దాచినట్లు వెల్లడించారు. 2015లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత తనకు రూ.50 లక్షలు రావడంతో తమ కష్టాలు గట్టెక్కినట్లు చెప్పుకొచ్చారు హార్ధిక్.