
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 324వ రోజు మంగళవారం ఉదయం నరసన్నపేట నియోజకవర్గంలోని లింగాల వలస నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి చల్లవానిపేట, సౌదాం, రేగులపాడు క్రాస్, కొప్పాలపేట క్రాస్, దుప్పాలపాడు క్రాస్, గంగుపేట, కస్తురిపాడు జంక్షన్ మీదుగా కొబ్బరిచెట్ల పేట వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.
అలుపెరుగని ప్రజాక్షేత్ర యాత్రికుడు వైఎస్ జగన్ పాదయాత్ర టెక్కలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కోటబొమ్మాళి మండలం సౌడాం చేరుకున్న వైఎస్ జగన్కు అభిమానులు, పార్టీ కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. జననేతను చూసేందుకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపిస్తున్నారు. వైఎస్ జగన్తో సెల్ఫీలు దిగేందుకు యువతీ, యువకులు పోటీపడుతున్నారు.