సర్వేను అడ్డుకున్నారనే నెపంతో కేసులు.. | Vizianagaram Police File Cases Against YSRCP Leaders | Sakshi
Sakshi News home page

స్టేషన్‌ బెయిల్‌పై విడుదలైన మజ్జి శ్రీనివాసరావు

Jan 25 2019 3:59 PM | Updated on Jan 25 2019 4:28 PM

Vizianagaram Police File Cases Against YSRCP Leaders - Sakshi

సాక్షి, విజయనగరం: దొంగ సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుందని సమాచారం ఇచ్చిన వైఎస్సార్‌ సీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సర్వే సభ్యులను అడ్డుకున్నారనే నెపంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను దాదాపు 8 గంటల పాటు నిర్భంధించి విచారణ చేపట్టారు. మజ్జి శ్రీనివాస్‌ అక్రమ అరెస్ట్‌పై వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఆయనను స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. తనను పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేశారనే దానికి పోలీసులు సరైన కారణం చెప్పలేకపోతున్నారని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరులు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన కోరారు.

ఈ ఘటనపై డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సర్వే చేసుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా పీపుల్స్‌ రీసెర్చ్‌ అనే సంస్థ సర్వే చేస్తున్నట్టు తెలిపారు. సర్వేను అడ్డుకున్నవారిపై రెండు కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. జామి పీఎస్‌లో శ్రీనివాసరావును విచారించి స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేసినట్టు తెలిపారు.(టీడీపీ వారి కత్తిరింపు సర్వే!)

ఒక సర్వే సంస్థపై అనుమానం తలెత్తినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, దానిపై విచారణ చేపట్టకుండా.. సర్వేకు అడ్డుతగిలారనే నెపంతో వైఎస్సార్‌ సీపీ నాయకులపై కేసులు నమోదు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వే వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర దాగివుందనే ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూర్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement