‘తెలంగాణలో నిర్బంధ, నియంతృత్వ పాలన’

uttam kumar reddy slams KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధ, నియంతృత్వ పాలన సాగుతోందని.. ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు లేకుండా పోయాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మందకృష్ణ మాదిగను తమ పార్టీ నేతలతో పాటు ఆయన కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన భారతి అనే మహిళ సంస్మరణ సభ జరిపినందుకు మందకృష్ణను అరెస్ట్ చేశారని తెలిపారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోతామని సీఎం కేసీఆర్‌ హామీయిచ్చారని గుర్తు చేశారు. అదే ముఖ్యమంత్రి.. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మందకృష్ణను అరెస్ట్ చేసి రెండు వారాలు జైల్లో పెట్టించారని ధ్వజమెత్తారు. ఇంత దారుణంగా పాలన సాగుతోందని,  అణగారిన వర్గాలకు హక్కులు లేకుండా పోయాయని వాపోయారు.

నెరేళ్లలో దళితులను ఇసుక మాఫియా అండతో పోలీసులు వేధింపులకు గురిచేశారని, ఖమ్మంలో మద్దతుధర కోసం డిమాండ్ చేసినందుకు రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టారని తెలిపారు. ఇపుడు మంద కృష్ణను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డిపై కూడా కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించినందుకు ఆయనను అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top