లాటరీ ఎమ్మెల్యే.. నాపై విమర్శలా?

TRS Mahender Reddy Fire On MLA Pilot Rohit Reddy - Sakshi

నీలాగా దిగజారి మాట్లాడితే తట్టుకోలేవ్‌ 

రాజకీయాల్లో సద్విమర్శలు చేయాలి 

మాజీ మంత్రి మాణిక్‌రావు కూడా నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి

సునీతారెడ్డి మూడోసారి జెడ్పీ చైర్‌పర్సన్‌ అవుతారని వెల్లడి

బషీరాబాద్‌: ‘మొన్న తాండూరులో జరిగిన ఎన్నికల్లో లక్కీలాటరీలా.. ఎమ్మెల్యేగా గెలిచినోడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు.. నేను లోకల్‌ కాదని, నన్ను షాబాద్‌ పంపిస్తానని.. భాష రాదని.. ఎగతాలిచేస్తుండు.. నేను తలుచుకుంటే తాండూరులో బట్టలు ఊడదీసి పంపిస్తా..రాజకీయాల్లో హుందాగా విమర్శించడం నేర్చుకో.. మాజీ మంత్రి మాణిక్‌రావు కూడా ఇలా నాపై విమర్శలు చేయలేదు. నీలా దిగజారి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు..’’ అంటూ మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బషీరాబాద్‌ వచ్చిన ఆయన మైల్వార్‌లో నిర్వహించిన సమావేశంలో మొదటిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

శాసనసభ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన రోహిత్‌రెడ్డి వారిని మోసం చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే పచ్చి అబద్ధాలకోరు.. మూర్ఖత్వంతో అలా మాట్లాడుతున్నాడని విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో సద్విమర్శలు చేస్తే మంచిది.. లేదంటే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో 18 జెడ్పీటీసీ సీట్లు గెలిచి సునీతారెడ్డి మూడో సారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కాబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు.  సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిలా మారాయన్నారు.

ఎన్నికలు ముగిసన వెంటనే.. ఇచ్చిన మాట ప్రకారం రెండింతల పెన్షన్లు, ఎకరాకు రూ.5 వేల రైతుబంధు సాయం అందజేస్తామని స్పష్టంచేశారు.టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పోరవాటి మాట్లు మాట్లాడుతున్నాడన్నారు. కనీసం పెద్దవాళ్లనే సంస్కారం కూడా లేకుండా ఇష్టానుసారం విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం ఎక్మాయి, మంతన్‌గౌడ్‌తండా, క్యాద్గిర, జీవన్గీ, మర్పల్లి, నవల్గా గ్రామాల్లో  మహేందర్‌రెడ్డి రోడ్‌షోలు నిర్వహించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ అభ్యర్థి మిరాణం శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాకేశ్, సీనియర్‌ నాయకుడు రాజుగౌడ్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకట్‌రామ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కావలి భాస్కర్, అజయ్‌ప్రసాద్, శంకర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, అబ్దుల్‌ ఖాలీద్, సుధాకర్‌రెడ్డి, బన్సీలాల్, నర్సిరెడ్డి, హరిసూధన్‌రెడ్డి, శ్రావన్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్, ఎక్మాయి రాజుగౌడ్, సర్పంచులు సీమా సుల్తాన, నారాయణ, వసంతమ్మ, లక్ష్మమ్మ, కోటం నవనీత, డి. నర్సిములు, ఎంపీటీసీ అభ్యర్థులు షాజాదీబేగం, వినోద, శ్రీనివాస్, పుర్మ సునీత తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top