టీఆర్‌ఎస్‌దే హవా | TRS Full Swing In Exit Polls Survey | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌దే హవా

May 20 2019 1:36 AM | Updated on May 20 2019 5:05 AM

TRS Full Swing In Exit Polls Survey - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అం చనా వేశాయి. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకుగాను ఆ పార్టీ అత్యధికంగా 15 సీట్లు గెలుచుకుంటుం దని ఆదివారం పలు జాతీయ చానళ్లు తమ సర్వేల ద్వారా తేల్చాయి. న్యూస్‌ఎక్స్‌–నేతా సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌కు 15 స్థానాలు రానున్నాయి. ఈ సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్‌కు ఒక్క స్థానం వస్తుండగా ఎంఐఎం మరో సీటు గెలుచుకోనుంది. బీజేపీ ఖాతా తెరవడం లేదు. ఇండియా టుడే సర్వే ప్రకారం అయితే టీఆర్‌ఎస్‌కు 10–12 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుండగా కాంగ్రెస్‌కు 1–3 స్థానాలు, బీజేపీకీ అదే స్థాయిలో సీట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది. ఇక అన్ని జాతీయ చానళ్ల సర్వేల్లోనూ ఎంఐఎం తన ఒక్క స్థానాన్ని పదిలపరుచుకుంటుందని వెల్లడైంది. 

ఆ రెండు పార్టీల్లో ఉత్కంఠ... 
ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం అన్ని సర్వేల్లో కాంగ్రెస్‌ కనీసం ఒక్క స్థానం గెలుచుకుంటుందని తేలింది. ఒక్క న్యూస్‌ఎక్స్‌–నేతా మినహా అన్నింటిలోనూ బీజేపీ ఒక్క స్థానం గెలుచుకోబోతోంది. దీంతో ఆ ఒక్క స్థానం ఏమిటనేది ఆ రెండు పార్టీల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. మిగిలిన సర్వేల్లో ఆ రెండు పార్టీలకు మూడు స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించడంతో అసలు ఎక్కడెక్కడ విజయావకాశాలు ఉన్నాయన్న దానిపై ఇరు పార్టీలు లెక్కలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ, భువనగిరి, చేవెళ్ల, ఖమ్మం, మల్కాజిగిరి స్థానాలపై ఆశలు పెట్టుకోగా బీజేపీ సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో సానుకూల ఫలితాలు ఆశిస్తోంది. ఈ సర్వేల ప్రకారం కనీసం ఒకటి లేదా మూడు స్థానాలు గెలిచే అవకాశం ఆ రెండు పార్టీలకు ఉన్నా గెలుపు తీరం ఎక్కడ చేరుతుందన్నది మాత్రం ఈ నెల 23న తుది ఫలితాలు వెల్లడయ్యాక తేలనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement