చెవిరెడ్డిని అడ్డుకుంటున్న పులివర్తి నాని అనుచరులు
ప్రచారం చేయడానికి వీల్లేదంటూ బెల్ట్ తీసుకుని దాడికి యత్నించారు.
సాక్షి, చంద్రగిరి: ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డుతగులుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు అడ్డుకున్నారు. పథకం ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అల్లరి ముకులు రెచ్చిపోయారు. పులివర్తి నాని దగ్గరుండి టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పడంతో పేట్రేగిపోయారు. పచ్చ కార్యకర్తలు చెవిరెడ్డి వాహనం మీద దాడి చేశారు. పట్టాభి నాయుడు అనే కార్యకర్త బెల్టుతో వీరంగం సృష్టించాడు. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు.

బెల్టుతో పట్టాభి నాయుడు వీరంగం
ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని సర్దిచెప్పేందుకు చెవిరెడ్డి ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, కేంద్ర బలగాలను భారీగా మొహరించారు. న్యాయం కోసం చెవిరెడ్డి రోడ్డుపై బైఠాయించినిరసనకు దిగారు. టీడీపీ నాయకుల అరాచకాలు తారాస్థాయికి చేరాయని ఆయన విమర్శించారు. తన గ్రామంలోకి ప్రచారానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని ఎంతో గౌరవంగా చూసుకున్నామని ఆయనీ సందర్భంగా వెల్లడించారు.


