
చంద్రగిరి: తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు.. తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి తమిళనాడులోని వేలూరు నుంచి తిరుమలకు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం అగరాల నారాయణ కళాశాల వద్దకు వచ్చేసరికి బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. దాదాపు 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్ రాజారెడ్డి, కండక్టర్ లక్ష్మీనారాయణ, ప్రయాణికులు శ్రావణ్కుమార్, దీపారాణి, నితీశ్కుమార్, అక్షయ్కుమార్, తిరుసడై, తేజస్విని, రామ్లక్ష్మి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరికొందరిని చంద్రగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.