తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఏమిటి?
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అభివృద్ధి జరిగిందని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, ఈ అభివృద్ధిలో ఆయన తన పాత్ర ఏంటో చెప్పాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సగటు ఆదాయం పెరిగిందన్న మాటల్లో వాస్తవం ఉంటే అది ప్రజలకు పంచుతారా అని ప్రశ్నించారు. మఖ్దూం భవన్లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్ చుట్టుపక్కలున్న నాలుగు జిల్లాల్లో మాత్రమే అభివృద్ధి జరిగితే సరిపోదని, మిగిలిన జిల్లాల్లోనూ జరగాలని, అప్పుడే అభివృద్ధి అయినట్టని అన్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో జాతీయ సమితి సమావేశమై రాజకీయ తీర్మానాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న సెక్యులర్ శక్తులను ఏకం చేస్తామని తెలిపారు.
బీజేపీ వ్యతిరేక శక్తులు, విభిన్న శక్తులను కూడగట్టుకొని ఎన్డీయే సాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని వివరిం చారు. రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తామంటున్న బీజేపీ ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానిని సమర్థిస్తామని, మేవాని కూటమికి తమ మద్దతు ఉంటుందన్నారు. జడ్జీలను నియమించే అధికారం ప్రధానికివ్వాలన్న కుట్ర ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మొదలైందన్నారు.