ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శతృఘ్న సిన్హా

Shatrughan Sinha Said Advaniji Was In Tears Did Not Stop Me From Leaving - Sakshi

ముంబై : నేను ఇప్పుడు సరైన, ఉత్తమమైన దారిలోనే వెళ్తున్నాను. దీనికి అద్వానీజీ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయన్నారు నటుడు, కాంగ్రెస్‌ నాయకుడు శతృఘ్న సిన్హా. 20 ఏళ్లుగా బీజేపీతో కలిసి సాగిన శతృఘ్న..  సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు సరైన దారిలో వెళ్తున్నాను. ఉత్తమైన మార్గాన్ని ఎంచుకున్నాను. ఇందుకు అద్వానీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. నా నిర్ణయం తెలుసుకుని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కానీ వెళ్లవద్దని నన్ను ఆపలేదు. సరే మంచిది అని మాత్రం అన్నార’ని తెలిపారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి అధ్వర్యంలో శతృఘ్న బీజేపీలో చేరారు. దాదాపు 20 ఏళ్ల పాటు బీజేపీతో కొనసాగిన శతృఘ్న.. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. వాజ్‌పేయి కాలంలో బీజేపీలో ప్రజాస్వామ్యం కనిపించేదని.. కానీ నేడు రాచరికం పెత్తనం చెలాయిస్తుందని శతృఘ్న ఆరోపించారు. ప్రస్తుతం పార్టీలో అనుభజ్ఞులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ అద్వానీకి టికెట్‌ కేటాయించకపోవడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను అద్వానీలానే. ఎవరికి తలవంచను. వారు కూర్చోమంటే కూర్చోవడం.. నిల్చోమంటే నిల్చోడం వంటి పనులు నేను చేయలేను’ అన్నారు. అంతేకాక నిరుద్యోగం, వ్యవసాయం సంక్షోభం గురించి ప్రశ్నిస్తే.. మోదీ పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడతారని శతృఘ్న మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top