కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్
శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం గాంధీభవన్లో ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డితో కలసి మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్ర, కేసీఆర్ రాజకీయ జీవితం గురించి తెలియకుండా కేటీఆర్ నోటికొచ్చి నట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను పిల్లకుంక అయిన కేటీఆర్ భూస్థాపితం చేస్తాడా అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్లోనే కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభించాడని, తెలంగాణ ఇస్తేనే ముఖ్యమంత్రిగా కేసీఆర్, కేటీఆర్ మంత్రి అయ్యారనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేసుకుని దేశ ప్రజలను మోదీ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. మోదీ అసలు రూపం బయటపడిందని, ఇప్పుడంతా రాహుల్గాంధీ వైపు చూస్తున్నారని షబ్బీర్ అలీ చెప్పారు. పొంగులేటి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ను తొక్కేయడం కేటీఆర్ తాత తరం కూడా కాదన్నారు.