సీబీఎన్‌@ నవ్యాంధ్రజ్యోతి | Political Satirical Story On Common Man And Chandrababu | Sakshi
Sakshi News home page

సీబీఎన్‌@ నవ్యాంధ్రజ్యోతి

Apr 2 2019 7:29 AM | Updated on Apr 2 2019 7:29 AM

Political Satirical Story On Common Man And Chandrababu - Sakshi

ఐదేళ్లుగా నవ్యాంధ్ర ఫుట్‌పాత్‌ మీద ఉన్న ఓ ఫుట్‌పాత్‌ నవ్యాంధ్రుడి ముందు ఆగింది సీబీఎన్‌ చానల్‌ వాళ్ల వ్యాను. వ్యాన్‌లో ఉన్న వ్యక్తి కిందికి దిగి నేరుగా ఆ ఫుట్‌పాత్‌ నవ్యాంధ్రుడి దగ్గరికి వచ్చాడు.
‘‘నీకు ఇల్లు లేదు. నువ్వొక అనాథవి. అయినా గానీ నీకు నవ్యాంధ్రపై గుండెల నిండా అభిమానం ఉంది. అవునా?’’ అన్నాడు. 
‘‘మీరు వేమూరి వారే కదా’’ అన్నాడు ఫుట్‌పాట్‌ నవ్యాంధ్రుడు.. ఒక్క నిముషమైనా ఆలోచించకుండా!
‘‘వావ్‌! ఎలా కనిపెట్టావ్‌.. నేనే వేమూరి వారినని’’ అన్నాడు వేమూరి వారు.
‘‘ఇల్లు లేకపోయినా, గుండెల నిండా నవ్యాంధ్రపై అభిమానం ఉంటుందని వేమూరి వారొక్కరే కనిపెట్టగలరు. చంద్రబాబు కూడా కనిపెట్టలేడు’’ అన్నాడు ఫుట్‌పాత్‌ పౌరుడు.
‘‘అదొక్కటే కాదు. నీ గురించి ఇంకా చాలా కనిపెట్టగలను. నీ వయసు 89. నీకు ఓటు హక్కు లేదు. నీకు తినడానికి తిండి లేదు. నీకు వృద్ధాప్య పింఛను లేదు. ఐదేళ్లుగా ప్రభుత్వం నీకేమీ చేయలేదు. అయినా నువ్వు మళ్లీ చంద్రబాబే రావాలని కోరుకుంటున్నావ్‌. రాత్రి దయాధర్మంగా పెద్దలిచ్చిన సొమ్ముతో అన్నం తినడమైనా మానేస్తావేమో కానీ, రోజూ ఉదయాన్నే మా ‘నవ్యాంధ్రజ్యోతి’ కొనుక్కుని చదవకుండా ఉండలేవ్‌. ప్రతి శనివారం రాత్రి నీకు నిద్రపట్టదు. త్వరగా తెల్లారడం కోసం చూస్తావ్‌. తెల్లారి లేవగానే మా పేపర్‌ కొంటావ్‌. అందులో ముందుగా నా ‘పలుకు’ చదివితేనే కానీ నువ్వు పళ్లు తోముకోవు. ‘పలుకు’ చదివాక కొన్నిసార్లసలు నీకు పళ్లు తోముకోవాలన్న అవసరమే కనిపించదు’’ అన్నాడు వేమూరి వారు. 
పెద్దగా ఎగ్జయిటేమీ అవలేదు ఫుట్‌పాత్‌ నవ్యాంధ్రుడు.
‘‘నీ గురించి ఇన్ని చెప్పాను కదా. నా గురించి ఏమీ చెప్పవా?’’ అని అడిగాడు వేమూరి వారు.  వర్తమాన రాజకీయాలపై మీరు వారం వారం భలే ‘రాజకీయాలు’ చేస్తుంటారు. ఆలోచనాపరులకు ఆలోచనలు కలిగిస్తుంటారు. విచక్షణాపరులకు విచక్షణ నేర్పుతుంటారు. నిన్నటి ‘పలుకు’లో ఏపీ విద్యావంతులు తమ మనసుల్లో ఏమనుకుంటున్నారో రాశారు’’
‘‘ఇంకా?!’’
‘‘నాలాంటి వాళ్లను వెదకిపట్టుకుని మీ పేపర్‌లో ఫస్ట్‌ పేజీలో ఫొటో వేస్తుంటారు. మొన్న కూడా ఒక గర్భిణి స్త్రీ ఫొటో వేశారు’’
‘‘ఇంకా?!’’ ‘‘రాజకీయాల్ని మించిన రాజకీయం.. మీ విశ్లేషణ రాజకీయం. జగన్‌ గురించి జనం అనుకోని దాన్ని ఎక్కుపెడతారు. చంద్రబాబు గురించి జనం అనుకుంటున్న దాన్ని తొక్కిపెడతారు’’ అన్నాడు ఫుట్‌పాత్‌ నవ్యాంధ్రుడు.
‘‘వావ్‌..’’ అన్నాడు వేమూరి వారు మళ్లీ. ‘‘ఏమైనా కావాలంటే అడుగు’’ అని కూడా అన్నాడు, పర్సు తీస్తూ. 
‘‘ఏమీ వద్దు. ఇవాళ్టి నవ్యాంధ్రజ్యోతి పేపర్‌ ఒకటి ఇప్పించండి చాలు. కొందామంటే రాత్రి ధర్మ ప్రభువులెవరూ డబ్బులివ్వలేదు’’ అన్నాడు ఫుట్‌పాత్‌ నవ్యాంధ్రుడు. 
వ్యాన్‌లోంచి ఒక కాపీ తీసిచ్చివెళ్లిపోయాడు వేమూరి వారు. ఆబగా పేపర్‌ చూశాడు నవ్యాంధ్రుడు. పాత పేపర్‌ అది! 
డేట్‌ని బట్టి కాకుండా, ‘చంద్రబాబుకు కేసీఆర్‌ మద్దతిస్తే?’ అనే హెడ్డింగ్‌ని బట్టి అది పాత పేపర్‌ అని గుర్తుపట్టాడు నవ్యాంధ్రుడు.  

-మాదవ్‌

Advertisement
 
Advertisement
Advertisement