అధికారంలోకి వస్తే ఆయన జైలుకే | Modi Election Campaign In Haryana | Sakshi
Sakshi News home page

అధికారంలోకొస్తే వాద్రా జైలుకే

May 8 2019 8:43 PM | Updated on May 8 2019 8:43 PM

Modi Election Campaign In Haryana - Sakshi

ఫతేబాద్‌: ప్రజల ఆశీస్సులతో మరోసారి తమ పార్టీ అధికారం చేపట్టబోతోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. హరియాణాలోని ఫతేబాద్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులను లూటీ చేసిన  ’షెహన్‌షా’ను రాబోయే ఐదేళ్లలో కటకటాల వెనక్కి పంపిస్తానంటూ పరోక్షంగా యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్‌ వాద్రాను హెచ్చరించారు. కేంద్రం, హరియాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా అతి తక్కువ రేట్లకు రైతుల నుంచి భూములు లాక్కుంటుందని ఆరోపించారు.

రైతులను లూటీ చేసిన వారిన ప్రజల ఆశీస్సులతో ఈ చౌకీదారు కోర్టుకు ఈడుస్తాడని చెప్పారు. ’వాళ్లు బెయిల్‌పై తిరుగుతున్నారు. ఈడీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తామే సార్వభౌమాధికారులమని, తమను ఎవరూ తాకలేరని వారనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లకు వణుకు పట్టుకుంది. వాళ్లను నేను దాదాపు జైలు గుమ్మం వరకూ తీసికెళ్లాను. మీ ఆశీస్సులుంటే రాబోయే ఐదేళ్ల లోపే వారిని జైలులో పెట్టిస్తా’ అని మోదీ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దేశాన్ని దోచుకున్న వారి నుంచి ఆ సొమ్ము కక్కిస్తానని ప్రధాని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల పోరులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేతులెత్తేశాయంటూ ఎద్దేవా చేశారు.

ఆ పాపం వారిదే.
1984లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సిక్కులను కాంగ్రెస్‌ కుటుంబం పొట్టనబెట్టుకుందని మోదీ ఆరోపించారు. 34 ఏళ్లుగా పది కమిషన్లను నియమించారని, అయినప్పటికీ వారికి న్యాయం జరగలేదని అన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement