
నకిరేకల్: ఈసారి నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లో శనివారం సోనియాగాంధీ జన్మదిన వేడుకలలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్కు కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తున్నారంటేనే ఎమ్మెల్యే వేముల వీరేశానికి గుబులు పుడుతుందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం దిగివచ్చినా ఇక్కడ కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ మూడవ కన్ను తెరిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఏ జిల్లాకు వెళ్లినా తమకు టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు.