జాతీయ ప్రాజెక్టుగా కాళేశ్వరం : ఎంపీ బూర డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని టీఆర్ఎస్కు చెందిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య డిమాండ్ చేశారు. ఏపీలో పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినట్లే కాళేశ్వరానికి కూడా కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఆయన కోరారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం రికార్డు సమయంలో సాంకేతిక, అటవీ అనుమతులు మంజూరుచేసిందని ఆయన పేర్కొంటూ అందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనేక శక్తులు ప్రయత్నించినా వాటన్నింటినీ తాము అధిగమించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని, ఈ ప్రాజెక్టు అన్నపూర్ణగా నిలుస్తుందని చెప్పారు. విభజన చట్టం ప్రకారం శాసనసభ స్థానాల పెంపుకోసం తాము పట్టుపడతామని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర సర్కార్పై ఉందన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు, హైకోర్టు విభజన, షెడ్యూల్ 9,10 సంస్థలు, ఉద్యోగుల విభజన అంశాలపై తాము పార్లమెంట్లో ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ఆయన వివరించారు.