‘చంద్రబాబుకు మాట్లాడే హక్కులేదు’
సాక్షి, అమరావతి: పోలవరంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాట్లాడే హక్కులేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబునాయుడు విసిరిన సవాల్ను సోము వీర్రాజు స్వీకరించారు. దమ్ముంటే పోలవరంపై చర్చిండానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబుకు ప్రతిసవాల్ విసిరారు. కేంద్రం ఇస్తున్న నిధులతో పోలవరం కడుతూ బీజేపీపై విమర్శలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరానికి మూడు వేలకోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.. అవకతవకలు జరిగిన పోలవరానికి మూడు వేలకోట్లు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
మూడు వేలకోట్లకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో నిజాలు మాట్లాడుతున్న తమపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీని బైటకు పంపినట్లే.. తమను కూడా పంపాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, కాల్వలు తవ్వింది కూడా ఆయనేనని తెలిపారు. వైఎస్సార్ తవ్విన కాలువలకు గొట్టాలు వేసి నదులను అనుసంధానం చేశానని చంద్రబాబు చెబుతుండటం శోచనీయమన్నారు.