కోదండరాంది పదవుల తండ్లాట:బాల్క సుమన్ | balka suman fires on kodandaram | Sakshi
Sakshi News home page

Dec 5 2017 1:34 PM | Updated on Dec 5 2017 2:15 PM

balka suman fires on kodandaram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కొలువుల కొట్లాట సభ నిర్వహించిన జేఏసీ చైర్మన్‌ కోదండరాంపై టీఆర్‌ఎస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కోదండరాం నిర్వహించింది కొలువుల కొట్లాట సభ కాదు.. తనకు పదవి కోసం జరిపిన తండ్లాట సభ అని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ విమర్శించారు. కోదండరాం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని, ఆ పార్టీతో ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని బాల్క సుమన్‌ ఆరోపించారు.  నిరుద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘కొలువులకై కొట్లాట’ సభలో కోదండరాం.. నేరుగా టీఆర్‌ఎస్‌ను, ముఖ్యమంత్రిని సంబోధిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘కాంట్రాక్టులు ఇప్పించి కమీషన్లు తీసుకోవడంపై దృష్టిపెడుతున్నారు. భూముల్ని ఎవరికి కట్టబెడదామా.. ఇసుక కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకుందామా అన్నవే ముఖ్యమంత్రికి ప్రధానమయ్యాయి. కాంట్రాక్లర్ల మేలు కోసమే నిరుద్యోగుల జీవితాలను బలి పెడుతున్నారు. నిరుద్యోగుల సమస్య ఈ ప్రభుత్వానికి అప్రధానమైపోయింది’’ అని కోదండరాం విమర్శించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement