కార్యదీక్షాపరుడు | Every human do work as usual | Sakshi
Sakshi News home page

కార్యదీక్షాపరుడు

Mar 4 2014 1:16 AM | Updated on Sep 2 2017 4:19 AM

కార్యదీక్షాపరుడు

కార్యదీక్షాపరుడు

ప్రతి వ్యక్తి ప్రతిక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఏ పనీ చేయకుండా ఎవడూ ఉండడు. కొందరు ‘ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నాను. ఖాళీగా కూర్చున్నాను’ అంటారు.

ప్రతి వ్యక్తి ప్రతిక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఏ పనీ చేయకుండా ఎవడూ ఉండడు. కొందరు ‘ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నాను. ఖాళీగా కూర్చున్నాను’ అంటారు. కానీ ఒక రకంగా అది కూడా ఒక పనియే అని వారు గుర్తించాలి. తమ ప్రయోజనంతోపాటు తోటివారి శ్రేయస్సు కోసం ఉపయోగపడే పనులు నిర్వహించే వారిని, అలాగే ఐహిక శ్రేయస్సునందించే లౌకిక కార్యకలాపాలతోపాటు పారమార్థికమైన, మోక్షోపయోగియైన కార్యనిర్వహణకై కృషి చేసే వారిని ఉత్తమ కార్యదీక్షాదక్షులని చెపుతారు. మహనీయుల మహితోక్తులలోని సారాన్ని వంటబట్టించుకోవడంలో, ఆచరించడంలో వచ్చే కష్టసుఖాలను, లాభనష్టాలను పరిగణనలోకి తీసుకొనరాదు. చినిగిన వస్త్రాన్ని - పట్టువస్త్రాన్ని, సాధారణ భోజనాన్ని - పంచభక్ష్య పరమాన్నాలను, కటిక నేలను - పట్టు పరుపులను సమంగా భావించాలి.   అప్పుడే అతడు నిజమైన కార్యసాధకుడిగా, ధీరుడిగా గుర్తింపు పొందుతాడు. ఈ విధమైన కార్యసాధకుడి లక్షణాలను భర్తృహరి మహాకవి అనాడే ఎంతో రమ్యంగా ఈ కింది సూక్తిరత్నంలో పేర్కొన్నాడు.
 
 క్వచిత్ పృథ్వీశయ్యః క్వచిదపిచ పర్యంకశయనః
 క్వచిత్ శాకాహారః క్వచిదపిచ శాల్యోదనరుచిః
 క్వచిత్ కంథాధారీ క్వచిదపిచ దివ్యాంబరధరో
 మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖం న చ సుఖమ్‌॥
 జన్మ తరించుటకవసరమైన సజ్జనసాంగత్యాన్ని పొంది, స్థిరచిత్తముతో ఎవడైతే లక్ష్యసాధనకు నడుంబిగించి కృషి చేస్తాడో అట్టివాడిని పెద్ద సమస్యలు కూడా అడ్డగించలేవని మన పూర్వకవు ల భావన. అసాధ్యసాధకులైన, సుధీరులైన, నిశ్చల మనస్కులైన మహనీయులను మార్గదర్శకులుగా భావిస్తూ కర్తవ్య నిర్వహణ చేసేవాడికి అగ్ని చల్లటి నీటివలె కనిపిస్తుందేకాని కాల్చివేసేదిగా ఉండదు.
 
 అదే విధంగా సముద్రమేమో ఒక చిన్న కాల్వగా, మేరు పర్వతం ఒక చిన్న పాషాణఖండంగా, మృగరాజైన సింహం ఒకలేడి (జింక) పిల్లగా, మహావిషసర్పము ఒక పూలదండగా, కాలకూటవిషం అమృతంలాగా కనిపిస్తుందని భర్తృహరి మహాకవి దృఢచిత్తుడైన ఉత్తమకార్యసాధకుడి మానసిక స్థితిని ప్రతిబింబింపచేస్తూ పేర్కొన్న ఈ సుభాషిత రత్నాన్ని ఆస్వాదిద్దాం;
 
 వహ్నిస్తస్య జలాయతే జలనిధిః కుల్యాయతే తత్ క్షణాత్
 మేరుః స్వల్పశిలాయతే మృగపతిః సద్యః కురంగాయతే
 వ్యాలో మాల్య గుణాయతే విషరసః పీయూష వర్షాయతే
 యస్యాంగే ఖిల లోక వల్లభతమం శీలం సమున్మీలతి॥
 కార్యనిర్వహణ చేసే వ్యక్తికి ఉత్సాహం, పట్టుదల, శ్రద్ధ, ఆసక్తి, అంకితభావం వంటి గుణాలు అవసరం. ఈ సద్గుణాలు కలిగిన కార్యకర్త ప్రతిపనిలో విజయాన్ని పొందుతాడు.  కార్యనిర్వహణ సమయంలో అతి తొందర పనికిరాదు. అట్లే ఉదాసీన భావన కూడా పనికి రాదు. వివేకవంతుడై కార్యారంభాన్ని చేయాలి. ఆరంభించిన కార్యాన్ని మధ్యలో తొట్రుపాటు చెందకుండా పూర్తి చేయాలి. ప్రాణహితకరమైన ఉత్తమకార్యాలను మనస్సులో సంకల్పించాలి. వాటిని వెంటనే ఆచరణలో పెట్టాలి. ప్రారంభించిన ఆ ఉత్తమకార్యాలను నిరాంటకంగా పూర్తిచేసి సత్ఫలితాలను పొందాలి. ఈ విధంగా మనుష్యులు నిరంతరం ఉత్తమ కార్యసాధనకై కృషిచేస్తూ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని, అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలను పొంది ధన్యచరితులు కావాలని ఆశిద్దాం.
 - సముద్రాల శఠగోపాచార్యులు

Advertisement

పోల్

Advertisement