ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది


బెంగళూరు:  సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న భర్తను,  తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కోలార్ జిల్లా శ్రీనివాసపురాలో శనివారం రాత్రి ఈ హత్య జరిగింది. తన కజిన్ వాసుదేవతో ప్రేమాయణం సాగిస్తున్న శిల్పారెడ్డి, అతనితో పారిపోయి విదేశాల్లో సెటిల్ అవ్వాలని కోరుకుంది. దీంతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనుకుని పథకం వేసింది. భర్త కేశవరెడ్డికి పళ్లరసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి,అనంతరం పదునైన ఆయుధంతో దాడిచేసి చంపేసింది. తర్వాత ప్రియుడు వాసుదేవ సహాయంతో మృతదేహాన్ని సమీపంలోని నదిలో పడేసింది. తర్వాత ఏమీ తెలియనట్టుగా భర్త సోదరుడు తిరుమలకి ఫోన్ చేసి  కేశవరెడ్డి క్షేమ సమాచారాల గురించి ఆరా తీసింది.   



సాధారణంగా ఎప్పడూ తనకు ఫోన్ చేయని వదిన ఫోన్ చేయడంతో మరిదికి అనుమానం తలెత్తింది. దీనికితోడు ఆమె అసాధారణ ప్రవర్తనతో అనుమానం మరింత బలపడింది. ఈ  విషయాన్ని పోలీసుల చెవిన వేద్దామనకున్నాడు.  ఈలోపు ఆదివారం నదిలో శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడి ఐడీ కార్డు, ఇతర వస్తువుల ఆధారంగా మృతుడిని కేశవరెడ్డిగా తేల్చారు.



అటు అనుమానాస్పద మరణం, ఇటు మృతుని సోదరుడు ఇచ్చిన సమాచారం.. ఈ నేపథ్యంలో కేశవరెడ్డిది హత్యగా అనుమానించిన పోలీసులు శిల్పారెడ్డి  సెల్ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన తర్వాత ఆమెను తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం తెలిసింది. తమ విచారణలో శిల్ప తాను చేసిన నేరాన్ని అంగీకరించిందని  పోలీసులు తెలిపారు.



కేసు నమోదు చేసి, గురువారం శిల్పను అదుపులోకి తీసుకున్నామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ హత్యా నేరంలో శిల్ప తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నట్టు వారు గుర్తించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top