
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణం
తమిళనాడు 28వ ముఖ్యమంత్రిగా ఒ. పన్నీర్ సెల్వం(63) సోమవారం ప్రమా ణ స్వీకారం చేశారు. ఈ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు.
కొత్త కేబినెట్లోకి 30 మంది మంత్రులు కంటతడి పెట్టిన నేతలు
చెన్నై/బెంగళూరు: తమిళనాడు 28వ ముఖ్యమంత్రిగా ఒ. పన్నీర్ సెల్వం(63) సోమవారం ప్రమా ణ స్వీకారం చేశారు. ఈ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. ఆయనతో పాటు 30 మంది మంత్రులుగా ప్రమాణం చేయగా... వారిలో కూడా చాలా మంది ‘అమ్మ’(జయలలిత)ను తలచుకుని కంటతడి పెట్టారు. రాజ్భవన్లో సోమవారం మధ్యాహ్నం 1.25 గంటలకు నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో వీరితో గవర్నర్ రోశయ్య ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి స్వల్ప సంఖ్యలో ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. హోం, ఆర్థిక, ప్రజాపనులు సహా కీలక శాఖలను ముఖ్యమంత్రి అట్టిపెట్టుకున్నట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను బెంగళూరులోని సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించడమే కాకుండా, నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. చట్ట ప్రకారం ఆమె ఎమ్మెల్యేగా అర్హత కోల్పోవడంతో... అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్ష నేతగా పన్నీర్ సెల్వంను ఆదివారం ఎన్నుకున్నారు.
పన్నీర్ సెల్వంను ఓదార్చిన గవర్నర్
జయలలితకు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న పన్నీర్ సెల్వం... అమ్మ ఫొటోను పోడియం బల్లపై పెట్టి, ఆ తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఫొటోను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత గవర్నర్ రోశయ్య అభినందనలు తెలిపినప్పుడు కూడా పన్నీర్ సెల్వం విచారంతోనే కనిపించారు. దీంతో ఆయన్ను గవర్నర్ ఓదార్చాల్సి వచ్చింది. మంత్రుల్లో కూడా చాలా మంది ప్రమాణ స్వీకారం సందర్భంగా కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమానికి ఇతర పార్టీల నేతలు, మీడియాకు సైతం ఆహ్వానం అందలేదు. కాగా, ముఖ్యమంత్రిగా జయలలిత ఉపయోగించిన చాంబర్ను తాను వినియోగించరాదని, ప్రస్తుత కార్యాలయం నుంచే పాలన కొనసాగించాలని పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. 2001లో తాన్సీ కేసులో జయలలితను ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలిగా సుప్రీంకోర్టు ప్రకటించడంతో, ఆయన తొలిసారిగా సీఎం పీఠాన్ని అధిష్టించారు.
వెంటనే ‘అమ్మ’ దర్శనం
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ముగ్గురు మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం అనంతరం హుటాహుటిన బెంగళూరుకు చేరుకుని పార్టీ అధినేత్రి జయలలితను పరప్పన అగ్రహార జైలులో కలుసుకున్నారు.
‘అమ్మ’ కోసం
జయ జైలుకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేక తమిళనాడు వ్యాప్తంగా ఆదివారం నాటికి 20 మంది వరకు ప్రాణాలు విడిచినట్లు సమాచారం. వీరిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు గుండె ఆగి మరణించారు. మరోవైపు, సోమవారం కూడా అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. జయకు మద్దతుగా మంగళవారం సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. జయలలితకు కాంగ్రెస్ ఎంపీ పి.కన్నన్ కూడా బహిరంగ మద్దతు పలికారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా ప్రకటించడం, రాజకీయంగా ఆమెకు ప్రతిబంధకం కాబోదని, ఆమె మరిన్ని శిఖరాలను చేరుకుంటారని చెప్పారు.
కర్ణాటక హైకోర్టులో జయ బెయిల్ పిటిషన్
బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జయతో పాటు కోర్టు దోషులుగా ప్రకటించిన శశికళ, ఇళవరసి, సుధాకరన్ కూడా బెయిల్ కోసం పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను మంగళవారం వేకేషన్ బెంచ్ విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు తనపై మోపిన అన్ని అభియోగాలు అసత్యమని, సినిమాల్లో నటించడం ద్వారా వచ్చిన ఆదాయంతో చట్టబద్ధంగానే ఆస్తులు కొనుగోలు చేసినట్లు జయ తన పిటిషన్లో పేర్కొన్నారు. జయకు విధించిన శిక్షపై హైకోర్టు స్టే విధిస్తే ఎమ్మెల్యేగా ఆమె అనర్హత రద్దవుతుంది.
జయకు అనారోగ్యం.. ఏ క్షణమైనా ఆస్పత్రికి: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఏ క్షణమైనా ఆస్పత్రికి తరలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న జయలలిత బీపీ, షుగర్తో బాధపడుతున్నారు. ఆమె సోమవారం రాత్రి కొంత ఉద్వేగానికి గురయినట్లు సమాచారం. దీంతో ఆమెను ఏక్షణమైనా జయదేవ్ లేదా విక్టోరియా ఆస్పత్రుల్లో ఒకదానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆమె జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నందున అన్ని ఏర్పాట్లతో, ‘ఓ’ పాజిటివ్ బ్లడ్ గ్రూపు రక్తంతో సిద్ధంగా ఉండాలని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు సిటీ పోలీస్ కమిషనర్ ఎం.ఎన్ రెడ్డి సమాచారమిచ్చారు. అయితే జయలలిత అవసరాలు తెలుసుకోవడానికి ఆదివారం పలుమార్లు పురుష పోలీసులు వెళ్లడం వివాదానికి దారితీసింది. దీంతో ఆమె అవసరాలు కనుక్కునేందుకు హుటాహుటిన మైసూరు జైలులోని మహిళా అధికారి దివ్యాశ్రీని నియమించారు.