యాదవ్‌ నామినేషన్‌ తిరస్కరణ : ఈసీ వివరణ కోరిన సుప్రీం | Supreme Court Seeks EC Response To Ex BSF Jawans Plea | Sakshi
Sakshi News home page

యాదవ్‌ నామినేషన్‌ తిరస్కరణ : ఈసీ వివరణ కోరిన సుప్రీం

May 8 2019 12:07 PM | Updated on May 8 2019 12:07 PM

Supreme Court Seeks EC Response To Ex BSF Jawans Plea - Sakshi

మాజీ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ నామినేషన్‌ తిరస్కరణ : ఈసీ స్పందన కోరిన సుప్రీం

సాక్షి, న్యూఢిల్లీ : వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై ఎస్పీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాన్‌ తేజ్‌ బహుదూర్‌ యాదవ్‌ నామినేషన్‌ను తిరస్కరించడంపై సుప్రీం కోర్టు బుధవారం ఈసీ వివరణ కోరింది. దీనిపై రేపటిలోగా బదులివ్వాలని, యాదవ్‌ విజ్ఞప్తిని పరిశీలించాలని ఈసీని ఆదేశించింది. కాగా స్వతం‍త్ర అభ్యర్ధిగా, ఎస్పీ అభ్యర్ధిగా తాను దాఖలు చేసిన రెండు నామినేషన్లను ఈసీ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ యాదవ్‌ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. 

తన రెండు నామినేషన్‌ పత్రాల్లో వ్యత్యాసాల గురించి తాను సకాలంలో ఈసీకి వివరణ ఇచ్చినా నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. ఈసీ కోరిన ఆధారాలను సైతం సకాలంలో సమర్పించినా నామినేషన్‌ను తిరస్కరించారని యాదవ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా యాదవ్‌ ఎస్పీ అభ్యర్ధిగా, స్వతంత్ర అభ్యర్ధిగా దాఖలు చేసిన రెండు నామినేషన్లలో తాను ఉద్యోగం నుంచి వైదొలిగేందుకు పరస్పరం వేర్వేరు కారణాలను పొందుపరిచారని అంటూ ఈసీ ఆయన నామినేషన్‌ను బుధవారం తిరస్కరించింది. వారణాసిలో ప్రధాని మోదీపై ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్ధిగా తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను విపక్షాలు బరిలో దింపిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement