కడుపులో కత్తులు.. చెంచాలు.. బ్రష్లు..!
సిమ్లా : కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అవాక్కయ్యారు. అతని కడుపులో 8 చెంచాలు, 2 బ్రష్లు, 2 స్క్రూడ్రైవర్లు, ఓ క్తతి, డోర్లాచ్ ఉన్నట్లు గుర్తించి చికిత్స అందించారు. ఈ వింత ఆపరేషన్ హిమాచల్ ప్రదేశ్లోని మండిజిల్లాలోని శ్రీలాల్బహుదూర్ శాస్త్రి ప్రభుత్వ ఆసుప్రతిలో జరిగింది. కరణ్సేన్(35) అనే మానసిక స్థితి సరిగ్గా లేని ఆ రోగి.. కొద్ది రోజుల క్రితం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కరణ్సేన్ కడుపులో కత్తి ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కరణ్సేన్ను పరిశీలించి పరీక్షలు జరిపిన వైద్యులు.. అతని కడుపులో ఒక్క కత్తే కాకుండా ఇతర వస్తువులు ఉన్నాయని గుర్తించి షాకయ్యారు.
వెంటనే ముగ్గురు సర్జన్స్ 4 గంటలపాటు శ్రమించి అతని కడుపులోని వస్తువులను తొలగించారు. ఇది వైద్యచరిత్రలోనే అత్యంత అరుదైన ఘటనగా అభివర్ణించారు. దీనికి గల కారణాన్ని తెలుసుకున్న వైద్యుల బృందం.. మాములు మనుష్యుల ఎవరు ఇలా మెటాలిక్ వస్తువులను తినరని, అతను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి వాటిని ఆహరంగా తీసుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ప్రాణపాయం నుంచి బయటపడ్డారని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.