 
													సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మంగళవారం నాటికి కరోనా పాజిటివ్ కేసులసంఖ్య రెండువేలు దాటింది. రాష్ర్టంలో మొత్తం 37 జిల్లాల్లో కృష్ణగిరి మినహా అన్ని జిల్లాల్లో నెలరోజులుగా పాజిటివ్ కేసులు రోజూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలోనే అత్యధిక కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తుంది. రాష్ర్టవ్యాప్తంగా మంగళవారం నిర్ధారణ అయిన 121 కరోనా పాజిటివ్ కేసల్లో 103 కేసులు ఒక్క చెన్నైలోనే నమోదుకావడం గమనార్హం. అయితే చాలా కేసుల్లో వైరస్ ఎలా సోకిందనే లింక్ దొరక్క పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇలీవలె చెన్నైలో 43 కేసులు బయటపడగా వీరిలో 13 మందికి వైరస్ ఎలా సోకిందనే లింక్ దొరకలేదు. ఇప్పటివరకు రాష్ర్టంలో 2,058 కరోనా కేసులు నమోదుకాగా 25 మంది చనిపోయారు. (కరోనా భయం: తమిళనాడులో అమానుషం)
‘స్వచ్ఛంద’వ్యాప్తి.. ప్రజల్లో భీతి
లాక్డౌన్తో తినడానికి సరిగ్గా తిండి దొర్కక అవస్తులు పడుతున్న వారి ఆకలి తీర్చేందుకు ఓ స్వచ్ఛంద సేవకుడు ప్రతీరోజు కొంతమంది నిరాశ్రయులకు ఆహారం అందించాడు. అయితే గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు వంటి  లక్షణాలతో ఉండటంతో పరీక్షించగా  కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు యువకుడు కొన్ని రోజులుగా నిరాశ్రయులు, కార్మికులు, కొంతమంది పోలీసులకి సహా దాదాపు 80 మందిదాకా ఆహార పొట్లాలు అందించి  తనకు చేతనైన సహాయం చేశాడు. దీంతో వీరందరిని గుర్తించి, వారు ఎవరెవరిని కలిశారో అన్నదానిపై విచారిస్తున్నారు.  
సరి(హద్దు)లేని జాగ్రత్తలు..
వైరస్ను అడ్డుకట్టవేసేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం వారికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు బయటివారిని రానివ్వకుండా గోడను కట్టారు. దీంతో పాలు, కూరగాయలు  వంటి అత్యవసర సరుకుల పంపిణీకి తీవ్ర ఆటంకం కలిగింది. సరిహద్దు జిల్లాల కలెక్టర్ల మధ్య సమన్వయ లోపంతో వాహనాలు వేరే ప్రాంతాల మీదుగా అక్కడికి చేరుకోవాల్సి వచ్చింది. గుడియాత్తం–పలమనేరు రోడ్డు మధ్యలో ఈనెల 26వ తేదీ సాయంత్రం  గోడను కట్టడంతో  ఏపీ నుంచి తమిళనాడుకు అత్యవసర వస్తువులతో బయలుదేరిన లారీలన్నీ పలమనేరులో నిలిచిపోయాయి. మరికొన్ని వాహనాలు పలమనేరు నుంచి చిత్తూరుకు వెళ్లి అక్కడి నుంచి కాట్పాడి మీదుగా సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించి తమిళనాడులోకి ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి  అత్యవసర చికిత్స కోసం  వేలూరు ఆసుపత్రికి వెళ్లలేక  పలువురు రోగులు అల్లాడిపోయారు.  సమాచారం అందుకున్న  వేలూరు జిల్లా కలెక్టర్ షణ్ముగం ఆదేశంతో గోడను తొలగించారు. (సెల్ ఫోన్ పేలి చూపు కోల్పోయిన యువతి)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
