తనపై విమర్శలను తిప్పికొట్టిన డిగ్గీ రాజా

Digvijaya Singh Retweets Video Of BJP Leader Keshav Prasad Maurya Over Pulwama Attack Row - Sakshi

లక్నో : పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో ప్రధాని మోదీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మోదీ కావాలనే ఇలాంటి చర్యలకు దిగారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పుల్వామా ఉగ్రదాడి కాదు.. ఒక ప్రమాదం మాత్రమే అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ  సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రధాని మోదీ సహా అధికార పార్టీ నేతలు డిగ్గీ రాజాపై విమర్శల దాడి మొదలుపెట్టారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన పార్టీ నేతల తీరు.. వాళ్ల మెంటాలిటీ ఇదీ అంటూ మోదీ.. దిగ్విజయ్‌ సింగ్‌పై విరుచుకుపడ్డారు.(‘పుల్వామా ఉగ్రదాడి కాదు ప్రమాదం మాత్రమే’)

ఈ నేపథ్యంలో బుధవారం దిగ్విజయ్‌ సింగ్‌ రీట్వీట్‌ చేసిన ఓ వీడియో బీజేపీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఫిబ్రవరి 21న ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య విలేకరులతో మట్లాడుతూ..‘పుల్వామా ఉగ్రదాడి పెద్ద ప్రమాదం మాత్రమే. ఇందులో భద్రతా వైఫల్యం ఏమీ లేదు. అయితే ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో తన అనుమతి లేకుండానే చర్యలు తీసుకునేలా వారిని ప్రోత్సహించారు అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన డిగ్గీ రాజా... ‘ మౌర్యాజీ మాటలపై ఇప్పుడు మోదీ, ఆయన మంత్రులు ఏం సమాధానం చెబుతారు. అమర జవాన్ల పట్ల బీజేపీ వైఖరి ఏంటో స్పష్టమైంది’ కదా అని విమర్శలను తిప్పికొట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top