
ఆ ప్రేమ జంట కథ సుఖాంతం
తప్పులు చేయడం మానవ సహజం. చేసిన తప్పువల్ల కలిగే అనర్థాలకు స్పందించి తప్పులను సరిదిద్దుకున్ననాడే మానవత్వం పరిమళిస్తుంది.
దాదాపు మూడు గంటల కాలం పుట్టిన బిడ్డలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలింతను ఆశా కార్యకర్త వచ్చి చూసి బిడ్డల బొడ్లు కోసి 108 అంబులెన్స్ను రప్పించి మత్తిలి హాస్పిటల్కు తరలించిన తరువాత ఈ వార్త అన్ని ప్రధాన వార్తా పత్రికలలోను (సాక్షిలో కూడా) విసృత ప్రచారం పొందింది. దీంతో గ్రామపెద్దలు వారి తప్పును తెలుసుకున్నారు. కులాలు వేరైనా వారూ తమలాంటి వారేనన్న విషయాని గ్రహించి ఆ దంపతులను, వారికి పుట్టిన బిడ్డలను అక్కున చేర్చుకున్నారు.
ఈ దయనీయ గాథ ప్రజలందరి హృదయాలలో సానుభూతిని నింపగా గ్రామపెద్దలు కూడా కుల మతాలను పక్కకు నెట్టి వారిని గ్రామంలోకి అనుమతించడమే కాకుండా వారిపై విధించిన ఆంక్షలను తొలగించారు.ప్రేమిక దంపతులు గౌరీ, త్రిలోచన్లను వారి కవల పిల్లలను గ్రామంలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ పెద్దలు కరుణించడంతో త్రిలోచన్ తల్లిదండ్రులు కూడా ఆనందంతో కొడుకుకోడలిని దరిచేర్చుకుని చిన్నారి శిశువులను అక్కున చేర్చుకుని ప్రేమాభిమానాలను చూపించారు.మత్తిలి సమితి అధికారులు ప్రేమ దంపతులకు బీపీఎల్ కార్డుతో పాటు గ్రామీణ అవాస్ యోజనలో ఒక ఇల్లు మంజూరు చేశారు. ఏది ఏమైనా వెలివేతకు గురైన ప్రేమికుల కథ సుఖాంతమైంది. ఇది కులమతాలను పట్టించుకునే వారికి ఒక గుణపాఠం కాగదని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.