హిమాచల్‌ గవర్నర్‌గా దత్తాత్రేయ

Bandaru Dattatreya as Governor of Himachal Pradesh - Sakshi

ప్రమాణం చేయించిన ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ధరమ్‌ చంద్‌ 

ఎక్కడ ఉన్నా ప్రజలతో మమేకమవ్వడమే తెలుసు: దత్తాత్రేయ 

సాక్షి, న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌ 27వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం 10.30కి సిమ్లాలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ధరమ్‌ చంద్‌ చౌదరి.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. అంతకుముందు హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా దత్తాత్రేయను నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నతాధికారి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఫైలుపై సంతకం చేసి దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్‌ నూతన గవర్నర్‌ దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దత్తాత్రేయ కుటుంబసభ్యులతోపాటు, హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రివర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు కార్యక్రమంలో పాల్గొని దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు. 

దత్తన్నకు బీజేపీ నేతల అభినందనలు
సాక్షి, హైదరాబాద్‌: సిమ్లాలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన దత్తాత్రేయ కు రాష్ట్ర బీజేపీ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, జి.వివేక్, టి.రాజేశ్వరరావు, ధర్మారా వు, సంకినేని వెంకటేశ్వరరావు, కాసం వెంకటేశ్వ ర్లు, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.

జీవితంలో కొత్త అధ్యాయం: దత్తాత్రేయ
హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం తన జీవితంలో కొత్త అధ్యాయంగా భావిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 35 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్న తాను ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేశానని, ఇప్పుడు దక్కిన ఈ రాజ్యాంగబద్ధమైన పదవి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. దైవభూమిగా పేరుగాంచిన హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసే అవ కాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top