
సాక్షి, హైదరాబాద్ : గత కొంత కాలంగా తెలుగు టీవీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న బిగ్బాస్ సీజన్-2 ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. సినిమాల్లో తన నేచురల్ నటనతో ఆకట్టుకునే నాని ఈ సీజన్లో హోస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ను స్థానాన్ని రీప్లేస్ చేస్తూ వచ్చిన ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి తొలిరోజే యాంకరింగ్లో తన మార్క్ను చూపించారు. కంటెస్టంట్లను ఒక్కొక్కరిగా బిగ్బాస్ హౌజ్లోకి ఆహ్మానిస్తూ అలరించారు. ప్రారంభం నుంచి చెబుతున్నట్లే ఈసారి నిర్వాహకులు, 13మంది సెలబ్రిటీలతో పాటు ముగ్గురు సామన్యులకూ హౌజ్లో అవకాశం ఇచ్చారు. వీరిలో విజయవాడకు చెందిన సంజనా అన్నే, గణేష్లతో పాటు విశాఖపట్నానికి చెందిన నూతన్ నాయుడు ఉన్నారు.
అయితే బిగ్బాస్ హౌజ్లో తొలిరోజే సామాన్యులకు సెలబ్రిటీలు షాక్ ఇచ్చారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్లో బిగ్బాస్ ఇంటినుంచి బయటకు పంపేందుకు ఇద్దరిని ఎన్నుకోవాలని ఆదేశించారు. దీంతో తొలిరోజే కంటెస్టంట్లకు ఊహించని షాక్ ఎదురైనట్లు అయ్యింది. అయితే సెలబ్రెటీలు అందరూ మూకుమ్మడిగా సామాన్యుల నుంచి కంటెస్టెంట్లుగా వచ్చిన సంజనా, నూతన్ నాయుడుల పేర్లను సూచించారు. బిగ్బాస్ ఆదేశాల మేరకు ఇద్దరిని హౌజ్లో ఉన్న జైల్లో పెట్టి తాళం వేశారు. సోమవారం ఎపిసోడ్లో ఒకరిని బయటకు విడుదల చేసే అవకాశం ఉండటంతో ఆ ఒకరు ఎవరన్నది ఆసక్తిగా మారింది. దీంతో అసలు చిచ్చు రాజుకుంది. అంత మంది సెలబ్రిటీల్లోనూ సామాన్యులుగా వచ్చిన తమ పేర్లనే సూచిండం పట్ల మోడల్ సంజనా ఫైర్ అయ్యారు.