ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ | 'Rojulu Marayi' audio date is out | Sakshi
Sakshi News home page

ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ

Jun 19 2016 10:24 PM | Updated on Sep 27 2018 8:49 PM

ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ - Sakshi

ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ

మారుతి ఓసారి నన్ను కలిసి ‘రోజులు మారాయి’ కథ చెప్పి నన్ను కూడా ఈ చిత్రంలో భాగస్వామి అవ్వమన్నాడు...

- ‘దిల్’ రాజు
‘‘మారుతి ఓసారి నన్ను కలిసి ‘రోజులు మారాయి’ కథ చెప్పి నన్ను కూడా ఈ చిత్రంలో భాగస్వామి అవ్వమన్నాడు. తన సక్సెస్‌లు, ఎంచుకున్న రూట్ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా. మారుతి కథను దర్శకుడు మురళి చక్కగా తెరకెక్కించాడు. జేబీ మంచి పాటలిచ్చాడు. జూలై 1న చిత్రం విడుదల చేయనున్నాం. వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు.

చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక ప్రధాన పాత్రల్లో మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో మారుతి టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్‌పై జి.శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘రోజులు మారాయి’. జేబీ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని ‘దిల్’ రాజు, ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ- ‘‘ఒక ఆర్టికల్ నుంచి పుట్టిన కథ ఇది. మేం ఏ కథ అయితే అనుకున్నామో దాన్ని యథాతథంగా మురళి తెరకెక్కించాడు.

‘దిల్’ రాజుగారితో చేస్తున్న తొలి చిత్రమిది, ఎలా వస్తుందో అనే భయముండేది. కానీ, సినిమా చూశాక చాలా ఎగ్జయిట్ అయ్యా’’ అని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు మురళీకృష్ణ మాట్లాడుతూ- ‘‘వాస్తవ సంఘటన ఆధారంగా మారుతీగారు ఈ చిత్ర కథ తయారు చేసుకున్నారు. ‘భలేభలే మగాడివోయ్’ చిత్రం కంటే ముందే ఈ చిత్రం చేద్దామనుకున్నారాయన.

కానీ, ఈ కథను నాకు ఇచ్చి నన్ను దర్శకుణ్ణి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు బీవీఎస్‌ఎన్ ప్రసాద్, జి. నాగేశ్వరరావు, దర్శకులు జి.నాగేశ్వర రెడ్డి, సాయి రాజేష్, హీరో రోహిత్, చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక, ‘డార్లింగ్’ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: మారుతి, సమర్పణ: ‘దిల్’ రాజు.

Advertisement
 
Advertisement
Advertisement