‘రాగానే రోజ్‌వాటర్‌తో ముఖం కడిగేవాడిని’ | Rajkummar Rao Shares About Tough Times In His Life | Sakshi
Sakshi News home page

వాళ్లే నా ఫీజు కట్టారు: హీరో

Oct 22 2019 1:44 PM | Updated on Oct 22 2019 1:52 PM

Rajkummar Rao Shares About Tough Times In His Life - Sakshi

ముంబై : ఒకానొక సమయంలో కనీసం ఒక పూట భోజనానికి కూడా తన దగ్గర డబ్బులేని రోజులు ఉన్నాయని బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావ్‌ అన్నాడు. బ్యాంకు అకౌంట్లో కేవలం 18 రూపాయలు మాత్రమే కలిగి ఉన్న తాను.. ప్రేక్షకుల అభిమానం వల్ల ఈరోజు బీ-టౌన్‌ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నానన్నాడు. 2010లో లవ్ సెక్స్‌ దోఖా సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాజ్‌కుమార్‌ విలక్షణ పాత్రలు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్‌, ప్రియాంక చోప్రా వంటి టాప్‌ హీరోయిన్లకు జోడీగా నటించి కీలక నటుడిగా ఎదిగాడు. ఈ క్రమంలో పింక్‌విల్లా వెబ్‌సైట్‌తో మాట్లాడిన రాజ్‌కుమార్‌ చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం గురించి చెప్పుకొచ్చాడు.

‘ నేను దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. మా కుటుంబం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. స్కూలు ఫీజు కట్టేందుకు కూడా మా దగ్గర డబ్బులు లేవు. రెండేళ్లపాటు నా టీచర్లే నా ఫీజు చెల్లించారు. సిటీకి వచ్చిన కొత్తలో నేను ఓ చిన్న ఇంట్లో ఉండేవాడిని. నా వంతుగా రూ. 7వేలు కట్టాలి. నెలరోజుల పాటు సిటీలో గడపాలంటే కనీసం రూ. 15 నుంచి 20 వేల రూపాయలు అవసరమయ్యేవి. అలాంటి సమయంలో ఒకానొక రోజు నా బ్యాంకు అకౌంట్లో 18 రూపాయలు మాత్రమే ఉన్నాయని నోటిఫికేషన్‌ వచ్చింది. అప్పుడేం చేయాలో అర్థం కాలేదు. నటన మీద ఉన్న ఆసక్తితో ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో జాయిన్‌ అయ్యాను. అప్పుడు కనీసం సరైన బట్టలు కొనుక్కునేందుకు కూడా నా దగ్గర డబ్బులేదు. నా స్నేహితుడి ఇంట్లో ఉంటూ అడిషన్స్‌ కోసం తిరిగీ తిరిగీ ముఖాలు వాడిపోయేవి. రాగానే రోజ్‌ వాటర్‌తో ముఖం కడుక్కుని.. పర్లేదు మనం కూడా బాగానే ఉన్నాం అని సంబరపడిపోయేవాళ్లం. ఇలా నా ప్రయత్నాలు కొనసాగుతుండగా 2010లో సినిమా అవకాశం వచ్చింది అని రాజ్‌కుమార్‌ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement